బత్తలపల్లి: అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసి, వారి నుంచి పిడి బాకు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు బత్తలపల్లి ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలను శనివారం ఆయన వెల్లడించారు. బత్తలపల్లి స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇటీవల 31 గొర్రెలను అపహరించిన కేసులో ఇప్పటికే దాసరి లక్ష్మన్న, లోచర్ల బాలకృష్ణ, దాసరి రాముని పోలీసులు అరెస్ట్ చేసి, సొత్తును కూడా రికవరీ చేశారు. ఇదే కేసులో పరారీలో ఉన్న ముదిగుబ్బ మండలం కొడవండ్లపల్లికి చెందిన తండ్రీకొడుకులు ముష్టూరు గంగులప్ప, హరికృష్ణని శనివారం ఉప్పర్లపల్లి క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. గంగులప్పపై అనంతపురం, తనకల్లు, హిందూపురం, బత్తలపల్లి, ముదిగుబ్బ పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నాయి. హరికృష్ణ సాయంతో గంగులప్ప చోరీలకు పాల్పడేవాడు. కాగా, గత 12 ఏళ్లుగా వివిధ కేసుల్లో గంగులప్ప పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు.
పలు రైళ్లు రద్దు
గుంతకల్లు: మిచాంగ్ తుపాను కారణంగా గుంతకల్లు డివిజన్ మీదుగా నడుస్తున్న పలు ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు సీనియర్ డీసీఎం మనోజ్ తెలిపారు. రద్దు చేసిన ఎక్స్ప్రెస్ రైళ్ల వివరాలను శనివారం మీడియాకు వెల్లడించారు. 3, 4, 5 తేదీల్లో తిరుపతి–లింగంపల్లి (12733), 4, 5, 6 తేదీల్లో లింగంపల్లి – తిరుపతి (12734), 3, 4 తేదీల్లో తిరుపతి–సికింద్రాబాద్ (12763), 5, 6 తేదీల్లో సికింద్రాబాద్–తిరుపతి (12764), 3, 4, 5 తేదీల్లో నర్సాపూర్–ధర్మవరం ఎక్స్ప్రెస్ (17247), 4, 5, 6 తేదీల్లో ధర్మవరం–నర్సాపూర్ (17248) ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్లు వివరించారు. 5వ తేదీన తిరుపతి–అదిలాబాద్–తిరుపతి (17405/06) ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. 3, 4, 5 తేదీల్లో విశాఖపట్నం–కడప (17488) రైళ్లు, 4, 5, 6 తేదీల్లో కడప–విశాఖపట్నం (17487) రైలు, 3, 4 తేదీల్లో సికింద్రాబాద్–తిరుపతి–సికింద్రాబాద్ (20701/02) ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు. ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.