ధర్మవరం అర్బన్: ధర్మవరం పట్టణంలోని పలు ఆలయాలను శనివారం ఉమ్మడి జిల్లా జడ్జి శ్రీనివాస్ సందర్శించారు. లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం, దుర్గమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువలతో సత్కరించారు. జిల్లా జడ్జి వెంట సీనియర్ సివిల్ జడ్జి గీతావాణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రమ్యశ్రీలు ఉన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ తెలిపారు. స్థానిక కోర్టును శనివారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. జడ్జిలతో మాట్లాడారు. అనంతరం బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి అధ్యక్షతన బార్ అసోసియేషన్ సమావేశ భవనంలో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. గతంలో జడ్జిగా కృష్ణవేణి ఉన్న సమయంలో 33 కేసులకు సంబంధించిన పత్రాలను జిల్లా కోర్టు వారు తీసుకెళ్లారన్నారు. తిరిగి తీసుకురాకపోవడంతో కక్షిదారులతో పాటు తాము కూడా చాలా ఇబ్బందిగా పడుతున్నామని న్యాయవాదులు తెలిపారు. ఆ పత్రాలను ధర్మవరం కోర్టుకు పంపించేందుకు కృషి చేస్తానని జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 9న జరగనున్న జాతీయ మెగా లోక్అదాలత్ను విజయవంతం చేయాలన్నారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. టీ బంకు, జిరాక్స్ సెంటర్లను వారంలోపు వేరే చోటికి మార్చాలని ఆదేశించారు.