సోమఘట్ట వాసి అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

సోమఘట్ట వాసి అనుమానాస్పద మృతి

Published Tue, Apr 9 2024 12:25 AM

-

చిలమత్తూరు: మండలంలోని సోమఘట్టకు చెందిన నరసింహులు (40) తెలంగాణాలోని గద్వాల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానిక ఎస్‌ఐ గంగాధర్‌ తెలిపిన మేరకు... సోమఘట్టకు చెందిన టీడీపీ నాయకుడు తిప్పారెడ్డికి గద్వాల్‌లో కోళ్ల ఫారం ఉంది. అక్కడ పనిచేసేందుకు నలుగురు కూలీలను ఇక్కడి నుంచి పిలుచుకెళ్లారు. వారిలో ఒకరైన నరసింహులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నరసింహులు మృతదేహాన్ని సోమవారం స్వస్థలానికి తీసుకువచ్చారు. ఉద్దేశపూర్వకంగానే నరసింహులును హతమార్చినట్లుగా బంధువులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడారు. కాగా, ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు సదరు టీడీపీ నేత ప్రయత్నాలు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

నల్లచెరువు: అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం బాటిళ్లను సోమవారం స్థానిక హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్ద స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ లింగన్న తెలిపారు. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో సిబ్బందితో కలసి వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఎన్‌పీకుంట మండలం ఎదురుదోనకు చెందిన ఈశ్వరయ్య స్కార్పియో వాహనాన్ని ఆపి పరిశీలించడంతో 90 ఎమ్‌ఎల్‌ సామర్థ్యమున్న 80 బాటిళ్లతో పాటు మరో మూడు మూడు ఫుల్‌ బాటిళ్ల కర్ణాటక మద్యం పట్టుబడింది. నిందితుడు ఈశ్వరయ్యను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లుఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement