ఎచ్చెర్ల క్యాంపస్: పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగులు సీట్లకు అక్టోబర్ 3న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రవేశం పొందే విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు వర్తించవు. పూర్తిస్థాయి ఫీజును విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్, శ్రీకాకుళం మహిళా పాలిటెక్నిక్, ఆమదాలవలస ప్రభుత్వ పాలిటెక్నిక్, టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్, సీతంపేట మోడల్ పాలిటెక్నిక్(ఎస్టీ) కళాశాలలతో పాటు ఐతం, శ్రీవేంకటేశ్వరా, శివానీ, నారాయణ, టీవీఆర్ ప్రైవేట్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో ఖాళీ సీట్లు ఎక్కువగా ఉన్నా ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం పరిమితంగానే ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్ల నిర్వహణలో పాలిసెట్ రాసిన విద్యార్థులకు ప్రాధాన్యమిస్తారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రవేశాల సమన్వయకర్త, శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గురుగుబెల్లి దామోదర్రావు చెప్పారు.
700 మంది దాటితే
ప్రత్యేక పోలింగ్ కేంద్రం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : పోలింగ్ కేంద్రానికి దూరంగా ఉన్న, 700 మంది ఓటర్లకు పైబడి ఉండే అపార్టుమెంట్లలో ప్రత్యేక పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి తెలిపారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 22 నుంచి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతినిధుల సలహాలు, సూచనలు పరిశీలిస్తామన్నారు. సమావేశంలో నాయకులు రౌతు శంకరరావు(వైఎస్సార్ సీపీ), పి.ఎం.జె.బాబు(టీడీపీ), చల్లా వెంకటేశ్వరరావు(బీజేపీ) తదితరులు పాల్గొన్నారు.
ఇక క్యూలైన్లలోనే
కొబ్బరికాయల మొక్కులు
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో కొబ్బరికాయలను కొట్టే స్థలాన్ని మార్చుతూ అధికారులు నిర్ణయించారు. ఆలయ రాజగోపురానికి ఆనుకుని ఉన్న ఉచిత దర్శనాల క్యూలైన్ల వద్దనే ప్రత్యేకంగా కొబ్బరికాయలు కొట్టేలా గ్రానైట్ పలకలతో ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియను బుధవారం ఆలయ పాలకమండలి సభ్యులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఈవో వి.హరిసూర్యప్రకాష్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, పాలకమండలి సభ్యులు మండవిల్లి రవి, ద్వారపు అనూరాధ, జోగి మల్లెమ్మ, మైలపల్లి లక్ష్మి, లుకలాపు గోవిందరావు, జె.శ్రీనివాస్, సూపరింటెండెంట్ కృష్ణమాచార్యులు పాల్గొన్నారు.
విద్యా వికాసానికి సీఎస్సీతో ఒప్పందం
టెక్కలి: విద్యార్థుల్లో విద్యా వికాసం పెంపొందించేందుకు సీఎస్సీ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టి.గోవిందమ్మ తెలిపారు. ఈ మేరకు బుధవారం సంస్థ ప్రతినిధులతో ఒప్పంద పత్రాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ ద్వారా కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి వై.రామ్మోహన్రావు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బి.సతీష్కుమార్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ల్యూక్పాల్, ఝాన్సీరాణి, ఎ.రామారావు తదితరులు పాల్గొన్నారు.