అరసవల్లి: ఆదిత్యుని తెప్పోత్సవానికి వేళయ్యింది. క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా శుక్రవారం అంగరంగ వైభవంగా ఉత్సవం నిర్వహించనున్నారు. ఉత్సవానికి వినియోగించనున్న హంస వాహనం పూర్తి ఫిట్నెస్తో ఉందని ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్ ప్రకటించారు. గురువారం సాయంత్రం స్థానిక ఇంద్రపుష్కరిణిలో ట్రయల్ రన్ నిర్వహించారు. స్థానిక పోలీస్, ఫైర్, మత్స్యశాఖ సిబ్బందితో కలిసి ఆయన హంసవాహనంలో ఎక్కారు. మూడు సార్లు పుష్కరిణి చుట్టూ వాహనాన్ని తిప్పి ఫిట్నెస్ను అధికారుల బృందం పరిశీలించి సంతృప్తిని వ్యక్తపరిచారు. అనంతరం ఈఓ హరిసూర్యప్రకాష్ విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి స్వామి వారి జలవిహారయాత్ర ప్రారంభం కానుందని, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అటు పుష్కరిణి వద్ద, ఇటు ఆలయంలోపల కూడా తగిన ఏర్పాట్లు చేశామని, పుష్కరిణి చుట్టూ విద్యుత్ అలంకరణ చేయిస్తున్నట్లుగా వివరించారు. ఇక హంసవాహనంలోకి వైదిక సిబ్బందిని మాత్రమే అనుమతించనున్నామని, అలాగే వాహనంలోకి ఎక్కిన వారికి మత్స్యశాఖాధికారుల సూచనల మేరకు భీమా కల్పిస్తున్నామన్నారు. అలాగే ఆలయంలో శుక్రవారం (నేడు) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆదిత్యుని మూలవిరాట్టు పూర్తిగా స్వర్ణాలంకరణలో దర్శనమివ్వనున్నట్లుగా తెలియజేశారు. భక్తుల సెల్ఫోన్లు, కెమెరాలకు ఆలయం లోపలికి అనుమతి లేదని స్పష్టం చేశారు.
ట్రయల్ రన్ విజయవంతం
హంస వాహనంలోకి వైదిక సిబ్బందికే అనుమతి
స్పష్టం చేసిన ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్