● గార ఎస్బీఐకి క్యూ కడుతున్న ఖాతాదారులు ● ప్రతి రోజూ 10 నుంచి 15 మందికి తనఖా బంగారం విడిపించుకునేందుకు అవకాశం
గార: స్థానిక ఎస్బీఐలో తనఖా పెట్టిన బంగారం విడిపించుకునేందుకు అధికారులు ఎట్టకేలకు అవకాశం ఇచ్చారు. సోమవారం ఉదయం బ్యాంకు తెరిచేసరికి చాలా మంది ఖాతాదారులు తమ బంగారం విడిపించేందుకు, వివరాలు తెలుసుకునేందు కు బ్యాంకుకు వచ్చారు. అయితే వివరాలు ఇవ్వలేమని, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు లేవని సిబ్బంది బదులిచ్చారు. దీంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. రీజనల్ మేనేజర్ రాజు కారును అడ్డగించారు. దీంతో ఇన్చార్జి డీఎస్పీ విజయకుమార్, పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వివరాలు వెల్లడించేందుకు కౌంటర్ను పెట్టాలని, తనఖా విడిపించేందుకు అవకాశమివ్వాలని డీఎస్పీ బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఖాతాదారులు తీసుకువచ్చిన రశీదు ద్వారా తనిఖీ చేసి బంగారం ఉంటే రైట్ గుర్తును, లేదంటే ఇంటు గుర్తును వేస్తున్నారు. పలువురు మహిళా ఖాతాదారులు బ్యాంకులోనే కన్నీటి పర్యంతమయ్యారు. అక్టోబర్ నెలలో పెట్టిన బంగారం మాయమైనట్టు తెలుస్తోంది. తక్కువ రోజుల్లో తనఖా పెట్టిన ఖాతాదారు అంత త్వరగా విడిపించరన్న అంచనాతో బంగారం మాయం చేసినట్టు ఉంది. పోయినవి కూడా 10 తులాలు పైబడి ఉన్న బంగారం సంచులే మాయమయ్యాయి. 11 మంది ఖాతాదారులకు డబ్బులు జమ చేశాక బంగారం ఇచ్చారు. ప్రతి రోజూ 10 నుంచి 15 మంది వరకు తనఖా విడిపించేందుకు అవకాశముందని బ్రాంచి మేనేజర్ రాధాకృష్ణ తెలిపారు.
పోలీసుల అదుపులో ప్రైవేటు వ్యక్తులు
బుడుమూరు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇతని వద్ద నుంచి 27 తనఖా పెట్టిన బంగారం సంచులను పోలీసులు రికవరీ చేశారని, అదేవిధంగా శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు భోగట్టా. గార పోలీస్స్టేషన్లో బ్యాంకు సిబ్బందితో పాటు ఈ ఇద్దరు వ్యక్తులను డీఎస్పీ విజయకుమార్ విచారణ చేశారు. ఫిర్యాదులో ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరి నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు.
విచారణ వేగవంతం
శ్రీకాకుళం క్రైమ్ : సంచలనం రేపిన గార ఎస్బీఐ బంగారం మాయం కేసులో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. కేసులో ఉన్న కీలక వ్యక్తి, ఆత్మహత్యకు పాల్పడిన మహిళా బ్యాంకు ఉద్యోగిని సోదరుడు కిరణ్బాబును నగరంలోని సీసీటీఎస్ పోలీస్ స్టేషన్లో ఇన్చార్జి డీఎస్పీ విజయ్కుమార్ విచారించి అతని స్టేట్మెంట్ తీసుకున్నా రు. మాయమైన 86 బంగారు సంచుల్లో తన చెల్లెలు తరఫున 26 సంచులను తిరిగి బ్యాంకుకు చేర్చడంలో కిరణ్ పాత్ర చాలా స్పష్టం. దీంతో అతని స్టేట్మెంట్ కీలకమని పోలీసులు భావిస్తున్నారు. అంతే కాకుండా ఉదయం గారలో శ్రీకాకుళ ం ఆర్ఎం రాజు, మరో ముగ్గురిని డీఎస్పీ విచారించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికి ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉన్నారు.
బ్యాంకు సిబ్బంది చెప్పడం లేదు
బ్యాంకులో 14 తులాల బంగారంను రూ. 5 లక్షల తీసుకొని తనఖా పెట్టాను. ఈ రోజు వివరాలు చూడగా మీ బంగారం లేదని బ్యాంకు సిబ్బంది చెప్పారు. దీనిపై ఏం చేస్తారని అడిగితే ఎవ్వరు సమాధానం చెప్పట్లేదు. ఖాతాదారులకు నమ్మకం కలిగేలా నిర్ణయం చేయాలి.
– కోరాడ అమ్మాజీరావు, కొర్లాం
దాచుకున్న బంగారం కనబడటం లేదు
కష్టపడి కొనుక్కొన్న బంగా రం సొంత అవసరాల కో సం తనఖా పెడితే బంగా రం కన బడటం లేదని సులువుగా చెబుతున్నారు. 11 తులాల బంగారాన్ని బ్యాంకులో ఉంచాను. ఎప్పుడిస్తారో చెప్పడం లేదు.
– బెండి లక్ష్మీ, అంబళ్లవలస