ప్రజా సంకల్ప పాదయాత్రకు ఐదేళ్లు | Sakshi
Sakshi News home page

ప్రజా సంకల్ప పాదయాత్రకు ఐదేళ్లు

Published Tue, Jan 9 2024 1:32 AM

- - Sakshi

పసుపు రంగు కంచుకోటను వైఎస్‌ జగన్‌ అనే ఒకే ఒక్కడు పునాదులతో సహా పెకలించిన జ్ఞాపకాలకు ఆ స్థూపం సజీవ సాక్ష్యం. రాజకీయ ఉద్ధండుల అంచనాలను పటాపంచలు చేస్తూ వైఎస్సార్‌ కుమారుడు రాసిన నవ చరితకు ఆ కట్టడమే తొలి అక్షరం. విలువలు వదిలేసిన నాటి పాలకులు కలలో కూడా భయపడేలా ప్రజాక్షేత్రంలో ఆయన చేసిన యుద్ధానికి ఆ నిర్మాణం ఓ నిదర్శనం. తన పద ఘట్టనలతో పల్లెపల్లెనూ చైతన్య పరుస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాగించిన యాగానికి ఐదేళ్లు పూర్తయ్యాయి. అధికారంలోకి వచ్చాక ప్రజాక్షేత్రంలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న ఆయన జనం మనసులు గెలుచుకున్నారు.

ఇచ్ఛాపురం రూరల్‌: రాజన్న బిడ్డగా, ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రజా సంకల్ప పాదయాత్రకు ఐదేళ్లు పూర్తయ్యాయి. 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర ఆయన సాగించిన పాదయాత్ర ఇచ్ఛాపురంలోనే ముగిసింది. 2017 నవంబర్‌ 6వ తేదీన ఇడుపులపాయ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుంటూ, ప్రజలకు భరోసా ఇస్తూ 2017, 2018, 2019 సంవత్సరాల్లో పాదయాత్రను కొనసాగించారు.

తెలుగుదేశం పార్టీ అడుగడుగునా ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెరవకుండా ఎత్తుకున్న పనిని సమర్థంగా నిర్వర్తించారు. 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 54 మున్సిపాలిటీలు, 13 జిల్లాలు, 8 కార్పొరేషన్లు, 2,516 గ్రామాల గుండా 3,648 కిలో మీటర్ల మేర సాగిన ప్రజా సంకల్పయాత్ర 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో ముగిసింది. ఈ పాదయాత్ర తర్వాత 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్‌ సభ స్థానాలను వైఎస్సార్‌ సీపీ కై వసం చేసుకుంది. 2019 మే 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు సంక్షేమం అనే పదానికి పర్యాయపదంగా మారిపోయారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేశారు. పాదయాత్రకు గుర్తుగా లొద్దపుట్టిలో నిర్మించిన విజయ స్థూపం ఆ నాటి కథలను అందరికీ గుర్తు చేస్తోంది.

సమర్థ పాలకుడిగా..
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవస్థల దెబ్బకు దళారీలు మాయమయ్యారు. ‘కులం చూడం, మతం చూడం, పార్టీలు అసలే చూ డం...పేదరికం ఒక్కటే అర్హతకు ప్రామాణికం’ అన్నదే నేటి ప్రభుత్వం అజెండా. విద్య, వైద్యం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గృహాల నిర్మాణం వంటి ఎన్నో సంస్కరణలు అమలవుతున్నాయి. సాంఘిక భద్రతలో భాగంగా ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్నించే క్రమంలో పింఛన్లు, వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ఆర్థిక సాయం, ఆరోగ్య సంరక్షణ ద్వారా పేదలకు సాయం అందిస్తున్నారు.

 చరిత్రలో నిలిచిపోయేలా 
నేనున్నానంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో పేదలకు భరోసా ఇచ్చారు. మడమ తిప్పను, మాట తప్ప ను అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థను ప్రకటించి సంచలన సంస్క రణలకు శ్రీకారం చుట్టారు.  చరిత్ర నిలిచి పోయేలా ప్రజా రంజక పాలన సాగిస్తున్న జగనన్న మరో 30 ఏళ్లు సీఎంగా ఉండటం గ్యారెంటీ.  
– పిరియా విజయ, జెడ్పీ చైర్‌పర్సన్, శ్రీకాకుళం  

సామాజిక న్యాయం కోసం 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నదే సీఎం జగనన్న నమ్మిన సిద్ధాంతం. తాను నమ్మిన సిద్ధాంతాన్ని మాటల్లో చెప్పకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. ఆయనతో కలసి ప్రజాసంకల్పయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే రాబోయే ఎన్నికలకు విజయాలు.        – పిరియా సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే, ఇచ్ఛాపురం సమన్వయకర్త

సంక్షేమానికి పెద్దపీట 
వెనుకబడిన ఉత్తరాంధ్ర తలరాతను మార్చేసిన వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. వలస ప్రాంతంగా పిలిచే నోటితో ఉపాధి కల్పించే స్థాయికి తీసుకువచ్చారు. కిడ్నీ ఆస్పత్రితో పాటు ఇంటింటికి తాగునీరు, పోర్టులు నిర్మాణాలు చేపట్టి దేవుడయ్యారు. ప్రతి కుటుంబానికి మేలు కలిగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. విజయ స్థూపం సాక్షిగా మళ్లీ ఆంధ్ర ప్రదేశ్‌కు ముఖ్యమంత్రి జగనన్నే.  
– నర్తు రామారావు, ఎమ్మెల్సీ, శ్రీకాకుళం  

Advertisement
Advertisement