సాగర్‌ కాలువలో యువకుడు గల్లంతు | Sakshi
Sakshi News home page

సాగర్‌ కాలువలో యువకుడు గల్లంతు

Published Thu, Mar 9 2023 4:24 AM

అజయ్‌కుమార్‌ - Sakshi

మిర్యాలగూడ టౌన్‌: నాగార్జునసాగర్‌ ఎడమ కాలువలో యువకుడు గల్లంతైన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. అనుముల మండల కేంద్రానికి చెందిన ఆవులదొడ్డి సైదయ్య, రమణ దంపతులకు ఇద్దరు కుమారులు. సైదయ్య 10 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో రమణ తన ఇద్దరు పిల్లల చదువుల కోసం అనుముల నుంచి వచ్చి వలస వచ్చి మిర్యాలగూడ పట్టణంలోని ముత్తిరెడ్డికుంటలో నివాసముంటుంది. రమణ ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ కుమారులను చదివిస్తుంది. పెద్ద కుమారుడు అజయ్‌కుమార్‌(20) ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం స్నేహితులతో కలిసి హోలీ ఆడిన అజయ్‌కుమార్‌ స్నానం చేసేందుకు మండలం పరిధిలోని చిల్లాపురం వద్ద గల సాగర్‌ ఎడమ కాలువ వద్దకు వెళ్లాడు. అజయ్‌కుమార్‌కు ఈత రాకపోవడంతో కాలువ గట్టు వెంట మెట్లపై కూర్చోని స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి కాలువలో పడిపోయాడు. అజయ్‌కుమార్‌తో వెళ్లిన స్నేహితులు ఎవరికీ కూడా ఈత రాకపోవడంతో తమ మిత్రుడు నీటిలో మునిగిపోతున్నా కాపాడలేకపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎన్‌ఎస్‌పీ అధికారులతో మాట్లాడి కాలువకు నీటిని బంద్‌ చేయించి అజయ్‌కుమార్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. బుధవారం కూడా కాలువ వెంట వెతికినా ఆచూకీ దొరలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement