మునగాల(కోదాడ): మునగాల మండలంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన ఓ రైతు బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. గ్రామానికి చెందిన పట్ల సైదులు(50) వరి పైరు కోసి ధాన్యాన్ని ట్రాక్టర్లో తరలిస్తున్నాడు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్కు ఏర్పాటు చేసిన కర్ర విద్యుత్వైర్కు తగిలింది. తీగ ట్రాక్టర్ వెనుక నడుచుకుంటూ వస్తున్న సైదులుపై పడడంతో విద్యుత్షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సైదులు మృతిచెందిన ప్రాంతం నడిగూడెం రెవెన్యూ పరిధిలో ఉండడంతో కుటుంబసభ్యులు నడిగూడెం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహానికి గురువారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
యాదగిరిగుట్ట రూరల్: మండలంలోని సాధువెల్లి గ్రామంలో గురువారం వీధికుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన సుంకె హరీష్, సుగుణమ్మల కుమారుడు సుంకె శశిధర్ అంగన్వాడీ కేంద్రానికి వెళ్లాడు. పొలం పనుల నిమిత్తం తల్లిదండ్రులు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయారు. శశిధర్ సాయంత్రం తిరిగి ఇంటికి ఒంటరిగా వస్తున్న క్రమంలో వీధి కుక్కలు అతడిపై ఒక్కసారిగా దాడి చేశాయి. చెంప, కాళ్లతో పాటుగా, ఇతర భాగాలను తీవ్రంగా కరిచాయి. గమినించిన స్థానికులు కుక్కలను తరిమారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో, గాయాలపాలైన బాలుడిని ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. వారి సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు.