నిందితుడికి 6నెలల జైలుశిక్ష, జరిమానా | Sakshi
Sakshi News home page

నిందితుడికి 6నెలల జైలుశిక్ష, జరిమానా

Published Wed, Nov 22 2023 1:32 AM

-

భూదాన్‌పోచంపల్లి: బైక్‌ను అజాగ్రత్తగా నడిపి ఎదురుగా వస్తున్న వ్యక్తి మృతికి కారణమైన నిందితుడికి 6నెలల జైలు శిక్షతో పాటు రూ.8వేలు జరిమానా విధిస్తూ చౌటుప్పల్‌ జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ తీర్పు వెలువరించారు. ఎస్‌ఐ విక్రమ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా కోయలకొండ మండలం ఇబ్రహీంనగర్‌ గ్రామానికి చెందిన దేవర అంజనేయులు పోచంపల్లి మండలంలోని పిలాయిపల్లి గ్రామంలో జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. అంజనేయులు 2014 అక్టోబర్‌ 23న తన బైక్‌పై వేగంగా వెళ్తూ ఇబ్రహీంనగర్‌ గ్రామ శివారులో ఎదురుగా బైక్‌పై వస్తున్న రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన గుంజె కృష్ణ, అతడి భార్య లక్ష్మిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కృష్ణ తలకు తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ ఆర్‌. జగన్మోహన్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ కేసు మంగళవారం విచారణకు రాగా ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ పీవీ అవినాష్‌ తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న చౌటుప్పల్‌ జ్యుడిషియన్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ టి. మహతి వైష్టవి విచారణ జరిపి నేరం రుజువైనందున నిందితుడు అంజనేయులుకు 6నెలల జైలు శిక్ష, రూ.8వేల జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించారు. నిందితుడికి శిక్ష పడేలా కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టిన కోర్టు కానిస్టేబుల్‌ ముత్తయ్య, సమన్స్‌ అందించిన శివకుమార్‌ను ఎస్‌ఐ విక్రమ్‌రెడ్డి అభినందించారు.

Advertisement
Advertisement