కోదాడ: నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చే నాయకుల మాయ మాటలు నమ్మవద్దని, ఎల్లప్పుడూ మీతో ఉండే నాయకులనే గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. బుధవారం కోదాడలో బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్కు మద్దతుగా నిర్వహించిన రోడ్షోలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రంగాథియేటర్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు. కోదాడ నియోజకవర్గానికి కాళేశ్వరం జలాలలను తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించాడని, ఆయన బతికున్నంతకాలం కాంగ్రెస్పై పోరాటం చేశారని ఇప్పుడు అదే తెలుగుదేశం నాయకులు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని ఆయన అన్నారు. డిసెంబర్ 3 తరువాత మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అప్పుడు తెల్లకార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం ఇస్తామని, రైతుబంధు సాయం రూ.16 వేలకు పెంచుతామని, పింఛన్లను రూ.5 వేలకు, మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.3 వేలు ఇస్తామని అన్నారు. కోదాడలో బొల్లం మల్లయ్యయాదవ్ గెలిచిన తరువాత సీనియర్ నాయకుడు కన్మంతరెడ్డి శశిధర్రెడ్డికి రాష్ట్రస్థాయి పదవి వస్తుందని కేటీఆర్ చెప్పారు. కోదాడకు పాలిటెక్నిక్ కళాశాల, ఇండోర్ స్టేడియం, పట్టణాభివృద్ధికి రూ.100 కోట్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్, ఎమ్మెల్సీ రవీందర్రావు, కన్మంతరెడ్డి శశిధర్రెడ్డి, మున్సిపల్పల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
00000
చౌటుప్పల్లో రోడ్షోకు హాజరైన ప్రజలు