సూర్యాపేట టౌన్: 27వ జాతీయ యువజనోత్సవాల సందర్భంగా ఈ నెల 23న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి యువ కళాకారుల ఎంపికకు పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా క్రీడల, యువజన శాఖ అధికారి కె.వెంకట్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనదలిచిన అభ్యర్థుల వయస్సు 15 నుంచి 29 సంవత్సరాల లోపు ఉండాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన వారిని ఈ నెల 27 నుంచి 29వ వరకు జరిగే రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలకు పంపుతామని తెలిపా రు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారు వచ్చే ఏడాది జనవరి 12నుంచి 16 వరకు జరిగే జాతీయ స్థాయి యువజనోత్సవాలకు వెళ్తారని పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీ లోపు పోటీల్లో పాల్గొనదలిచిన అభ్యర్థులు తమ పేరు, పుట్టిన తేదీ ధ్రువీకరణ, ఆధార్ అడ్రస్, ఫోన్ నంబర్, ప్రదర్శన పేరు తదిత వివరాలతో జిల్లా క్రీడల అధికారి కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్ : 9490023949 నంబర్ను సంప్రదించాలని కోరారు.
సెలవులో డీసీసీబీ
సీఈఓ మదన్మోహన్
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓ కె.మదన్మోహన్ అనారోగ్యానికి గురై సెలవుపై వెళ్లారు. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని సమాచారం. ఆయన పదవీ కాలం జనవరి 2024తో ముగుస్తుంది. దీంతో కొత్త సీఈఓ నియామకం కోసం టెస్కాబ్కు లేటర్ రాసినట్లు బ్యాంకు చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి వెల్లడించారు.
మల్టీసర్వీస్ సెంటర్లను వినియోగించుకోవాలి
నల్లగొండ అగ్రికల్చర్ : నాబార్డు సహకారంతో ప్రాథమిక సహకార సంఘాలు నిర్వహించే మల్టీ సర్వీస్ సెంటర్లను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సూచించారు. శనివారం డీసీసీబీలో జిలా సహకార బ్యాంకు మేనేజర్లు, బ్రాంచీల మేనేజర్లు, సహకార సంఘాల సీఈఓలకు మల్టీ సర్వీస్ సెంటర్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఇప్పటి వరకు యాభై సహకార సంఘాల్లో మల్టీసర్వీస్ సెంటర్లను నాబార్డ్ మంజూరు చేసిందన్నారు. సెంటర్ల ఏర్పాటుకు రుణాలను ఇచ్చేందుకు నాబార్టు 2026 వరకు గడువును పెంచిందని తెలిపారు. సమావేశంలో ఎంఎస్సీ రాష్ట్ర కోఆర్డినేటర్ షరీఫ్, ఏజీఎం బ్రిజేష్,, సతీష్చంద్ర పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణ
బిల్లు ప్రవేశపెట్టాలి
భానుపురి (సూర్యాపేట): పార్లమెంట్ ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్ దండోరా జిల్లా అధ్యక్షుడు పడిదల రవికుమార్ డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతనెలలో హైదరాబాద్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంబేద్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లేటి లక్ష్మణ్ మాదిగ, శ్రావణ్, కనుకు ప్రశాంత్, రాజేష్, పాల్వాయి భరత్, వల్దాస్ మురళి, కందుల పవన్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రిలో పూజలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం చేసి తులసీ దళాలతో అర్చించారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గవాహనసేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం ముఖ మండపంలో అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన గావించారు. సాయంత్రం జోడు సేవలను ఊరేగించారు. రాత్రి శ్రీస్వామివారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని మూసివేశారు. భక్తులు పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.