నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి జాతీయ స్థాయిలో ఉత్తమ సహకార బ్యాంకు చైర్మన్గా ఎంపికయ్యారు. సహకార రంగంలో చేసిన కృషికిగాను ఉత్తమ చైర్మన్ అవార్డుకు ఎంపిక చేసినట్లు న్యూఢిల్లీలోని ఇంటలెక్చువల్ పీపుల్స్ ఫౌండేషన్ ఆయనకు లేఖను పంపింది. 2024 జనవరిలో న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఉత్తమ బ్యాంకు చైర్మన్ అవార్డును అందజేయనున్నట్లు తెలిపింది. తనకు అవార్డు రావడానికి సహకరించిన వైస్ చైర్మన్ ఎసిరెడ్డి దయాకర్రెడ్డి, ఇతర పాలకవర్గ సభ్యులు, జిల్లా రైతులు, సహకార సంఘాల అధ్యక్షులు, బ్యాంకు అధికారులు, సిబ్బందికి చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి ధన్యవాదాలను తెలిపారు.
ప్రతిఒక్కరూ
భక్తిభావం కలిగి ఉండాలి
సూర్యాపేట రూరల్: ప్రతిఒక్కరూ భక్తిభావం కలిగి ఉండాలని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. సూర్యాపేట మండల పరిధిలోని దాస్తండాలో నూతన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో గ్రామంలోని ప్రతి కుటుంబం చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జెడ్పీటీసీ జీడి భిక్షం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగాల శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నకారా కృషి మరువలేనిది
భానుపురి (సూర్యాపేట): ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ సాధనకు డీఎస్ నకారా చేసిన కృషి మరువలేనిదని రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేతలు అన్నారు. జాతీయ పెన్షన్దారుల దినోత్సవాన్ని సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పెన్షన్దారుల సంఘం వ్యవస్థాపకుడు డీఎస్ నకారా చిత్రపటానికి ఆ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి హమీద్ ఖాన్, మండల కోశాధికారి జి.సోమయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.సురేందరెడ్డి, జి.అశోక్ కుమార్ పాల్గొన్నారు.
ప్రజలను రెచ్చగొట్టేవారిని తరిమికొట్టాలి
నూతనకల్: దేశంలో మతోన్మాదం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేవారిని తరిమికొట్టాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆవునూరి మధు పిలుపునిచ్చారు. ఆదివారం నూతనకల్ మండల కేంద్రంలో గునగంటి సత్యనారాయణ జ్ఞాపకార్థం నిర్మించిన విజ్ఞాన కేంద్రాన్ని, పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పాలకులు అన్ని రంగాల్లో నిర్వీర్యం చేశారని ఆరోపించారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించిన సత్యనారాయణ సతీమణి జగదాంబ, వారి కుటుంబ సభ్యులను పార్టీ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వర్రావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాచకొండ జనార్దన్, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు నాగన్న, పెద్దింటి రంగారెడ్డి, గంటా నాగయ్య, దేసోజు మధు, మున్నా అశోక్, సుంకిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మల్లయ్య పాల్గొన్నారు.