గుర్రంపోడు : వ్యవసాయబావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుర్రంపోడు మండలం తానేదార్పల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలోజు రాములమ్మ(70)కు ఇద్దరు కుమారులు ఉండగా అందరూ కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నారు. ఉదయమే ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాములమ్మ తిరిగి రాకపోవడంతో వెదుకుతుండగా గ్రామ శివారులోని వ్యవసాయబావిలో విగతజీవురాలై కనిపించింది. గుర్తించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వృద్ద్యాప్యంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తాను ఎవరికీ భారం కాకూడదనే ఉద్దేశంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
పోస్టాఫీసులో డిపాజిట్ డబ్బులు పోయాయని..
● గుండెపోటుతో వృద్ధుడు మృతి
నాగార్జునసాగర్ : పోస్టాఫీసులో డిపాజిట్ డబ్బులు పోయాయని మనస్తాపంతో ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన నాగార్జునసాగర్లోని పైలాన్కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. ఇటీవల పైలాన్కాలనీలోని సబ్పోస్టాఫీసులో కోటిరూపాయల మేర ప్రజల డిపాజిట్లను పోస్టుమాస్టర్ డ్రా చేసుకుని వెళ్లిన ఘటన తెలిసిందే. పైలాన్కాలనీకి చెందిన గుండా మల్లికార్జున్(66)అదే పోస్టాఫీసులో సుమారుగా ఐదులక్షల మేర డిపాజిట్ చేసినట్లు సమాచారం. వారం రోజులుగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కుంటూ తీవ్ర మనస్తాపానికి గురైన మల్లికార్జున్కు గుండెపోటు రావడంతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
నాటు కోళ్లు అపహరణ
ఆత్మకూరు(ఎం): గుర్తుతెలియని వ్యక్తులు వ్యవసాయ బావి వద్ద ఉన్న నాటుకోళ్లను అపహరించారు. ఈ ఘటన ఆత్మకూరు(ఎం)మండలంలోని కొరటికల్లో ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. కొరటికల్ గ్రామ శివారులో లగ్గాల సోమయ్య వ్యవసాయ బావి ఉంది. శనివారం రాత్రి వ్యవసాయ బావి వద్ద ఉన్న ఇంటి కిటికిని దుండగులు ధ్వంసం చేసి 100 నాటు కోళ్లను అపహరించుకు పోయారు. ఆదివారం ఉదయం బావి వద్దకు పోయిన లగ్గాల సోమయ్య చోరీ విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దొమ్మేటి నాగరాజు తెలిపారు.