జిల్లా జైలు తనిఖీ
పాలమూరు: జిల్లా జైలును బుధవారం న్యాయ సేవాధికర సంస్థ జిల్లా కార్యదర్శి ఇందిర తని ఖీ చేశారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ జిల్లా చైర్మన్, ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా జైలును సందర్శించి, వంటగది, నీటి వసతి, భోజనాలు ఇతర సౌకర్యాలను పరిశీలించారు. ఖైదీలకు అందిస్తున్న వసతులను జైలర్ను అడిగి తెలుసుకున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
బాలానగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని బాలానగర్, కల్వకుర్తి ఏకలవ్య ఆదర్శ బాలుర గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికిగాను గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బాలానగర్ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన గిరిజన విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులలో చేరడానికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు పదో తరగతి మెమో, ఆధార్, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఫొటోలు జతపర్చాలని సూచించారు. పూర్తి వివరాలకు 92931 29393 నంబర్ను సంప్రదించాలని సూచించారు. 31లోపు పరీక్ష ఫీజు చెల్లించండి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెమిస్టర్–4, 6 ఫీజులను చెల్లించాలని రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణగౌడ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31లోగా ఆన్లైన్లో చెల్లించాలని, బీఏ, బీకాం వారు పేపర్కు రూ.150, బీఎస్సీ వారు పేపర్కు రూ.150తో పాటు ప్రాక్టికల్స్ రూ.150 చెల్లించాలని, మరింత సమాచారం కోసం 7382929609 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. సామాజిక సేవ..
అందరి బాధ్యత
పాలమూరు/మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సా మాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాల్సిన బాధ్యత అందరిపై ఉందని రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ నటరాజ్ అన్నారు. నోబెల్ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ రెడ్క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్ హెన్రీడూన్హంట్ జయంతిని పురస్కరించుకొని బుధవారం స్థానిక ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ తలసేమియా, రెడ్క్రాస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా జాన్ హెన్రీడూన్హంట్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏనుగొండ సన్నిధానం అనాథాశ్రమానికి ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల వృక్షశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో బియ్యం అందజేశారు. విద్యార్థులకు పలు అంశాలపై పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్కుమార్, బాబుల్రెడ్డి, చంద్రశేఖర్, అశోక్ కుమార్, స్వాతి, శ్రీనివాసులు, హిమనీల పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాలెట్
గడువు పెంపు
జడ్చర్ల టౌన్: పార్లమెంట్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు మరో రెండు రోజుల గడువు పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జడ్చర్లలోని బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఒకటో సెంటర్లో బుధవారం 796 ఓట్లకుగాను 649 ఓట్లు పోలయ్యాయి. రెండవ కేంద్రంలో 443 ఓట్లకు గాను 283 ఓట్లు పోలైనట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి తెలిపారు.