వేలూరు: ముఖ్యమంత్రి స్టాలిన్ పుట్టినరోజు వేడుకలను వేలూరు ఉమ్మడి జిల్లాతో పాటు తిరువణ్ణామలై జిల్లాలోనూ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. కార్యకర్తలు, అభిమానులు వివిధ ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులకు, నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేసి అన్నదానం చేశారు. వైద్యశిబిరాలు నిర్వహించారు. వేలూరు డిప్యూటీ మేయర్ సునీల్కుమార్ ఆధ్వర్యంలో కాట్పాడి ప్రాంతంలోని కార్పొరేటర్ శరవణన్ పారిశుధ్య కార్మికులకు దుస్తులతో పాటు అన్నదానం చేశారు. గాంధీనగర్లో డివిజన్ కార్యదర్శి పరమశివం నిరుపేదలకు బిర్యానీ, దుస్తులు అందజేశారు.
తిరువళ్లూరు జిల్లాలో..
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ ఉలుందై గ్రామంలో జరిగిన వేడుకల్లో పంచాయతీ అధ్యక్షుడు రమేష్ తన సొంత నిధులతో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. రూ.30 లక్షలతో మూడు తరగతి గదులు, రూ.1.20 లక్షల విలువ చేసే కంప్యూటర్లు, వెయ్యి మంది విద్యార్థులకు రెండు పూటలా భోజనం అందించారు. తిరువళ్లూరులోని 27 వార్డులోనూ డీఎంకే నేతలు పలుసేవా కార్యక్రమాలను నిర్వహించారు. పూందమల్లి, గుమ్మిడిపూండి, పొన్నేరి, ఊత్తుకోట, ఆవడి, అంబత్తూరు, మధురవాయల్ ప్రాంతాల్లోనూ డీఎంకే శ్రేణులు స్టాలిన్ జన్మదిన వేడు కలను ఘనంగా నిర్వహించారు.
కోలాహలంగా వేడుకలు..
పళ్లిపట్టు: పళ్లిపట్టులో డీఎంకే శ్రేణులు కోలాహలంగా జరుపుకున్నారు. అత్తిమాంజేరిపేటలో మండల మాజీ కోశాధికారి బీడీ.చంద్రన్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండులో కేక్ కట్చేసి పేదలకు అన్నదానం చేశారు. పార్టీ శ్రేణులు కదిరవన్, మురళిసేన, మోహన్, గోవర్దన్నాయుడు, రాజేంద్రన్, వెంకటేశన్, మణి పాల్గొన్నారు. ఆర్కేపేట మండలంలోని అమ్మయార్కుప్పం కార్యదర్శి గోవిందస్వామి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండులోని అన్నా విగ్రహానికి మండల కార్యదర్శి సీఎన్.షణ్ముగం పూలమాల వేసి నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించారు. పేదలకు స్వీట్లు పంచిపెట్టారు. పంచాయతీ సర్పంచ్ ఆనంది సెంగుట్టవన్ ఉపాధి కూలీలకు స్వీట్లు పంపిణీ చేశారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు. సెంగోట్టవన్, పంచాయతీ ఉపాధ్యక్షురాలు జయంతి షణ్ముగం పాల్గొన్నారు.