కుప్పనత్తం డ్యామ్ నుంచి
నీటి విడుదల
వేలూరు: రైతులు ఆరుతడి పంటల సాగు కోసం కుప్పనత్తం డ్యామ్ నుంచి నీటిని రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి కలెక్టర్ మురుగేష్ అధ్యక్షతన ఆదివారం విడుదల చేశారు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లాలోని సెంగం కుప్పనత్తం డ్యామ్లో ప్రస్తుతం 44.61 అడుగుల నీటిమట్టం ఉంది. డ్యామ్లోని కుడి, ఎడమ కాలువల నుంచిఆరుతడి పంటలు పండించుకునేందుకు నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపి నీటిని విడుదల చేసేందుకు అవసరమైన అనుమతిని పొందారు. దీంతో డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి డ్యామ్ను ప్రారంభించి మాట్లాడుతూ ఈ నీటిని 11 రోజుల పాటు తెరిచి ఉంచనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా జిల్లాలోని 47 చెరువులతో పాటు మొత్తం 9,728 ఎకరాల వ్యవసాయ పొలాలకు నీటిని సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. డ్యామ్ నుంచి వచ్చే నీటిని వృథా చేయకుండా పొదుపు చేయాలన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు అన్నాదురై, ఎమ్మెల్యేలు గిరి, శరవణన్, పంచాయతీ రాజ్ శాఖ చీఫ్ ఇంజినీర్ షణ్ముగం, అసిస్టెంట్ ఇంజినీర్ శివకుమార్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
అధునాతన ఫీచర్లతో
వాహనాలు
సాక్షి, చైన్నె : అత్యాధునిక టెక్నాలజీల ఆధారంగా, సరికొత్త ఫీచర్లతో వాహనాల తయారీపై దృష్టి పెట్టామని బజాజ్ ఆటో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ తెలిపారు. సరికొత్త అవతార్గా తాము రూపొందించిన గ్రాఫిక్స్ సెగ్మెంట్ –ఫస్ట్ ఫీచర్ ఈ నేకెడ్ స్పోర్ట్స్ బైక్ను ఆదివారం స్థానికంగా ఆయన పరిచయం చేశారు. నేకెడ్ స్పోర్ట్స్ మోటారు సైకిల్ బ్రాండ్ – పల్సర్ ఎన్ఎస్ సీరియస్లో రెండు వేరియంట్లలో వీటిని పునర్ ప్రారంభించామని వివరించారు. ఎన్ఎస్ 200, ఎన్ఎస్ 160లు ప్రస్తుతం మరింత ఆకర్షణ, మెరుగైన నిర్వహణ, భద్రత పరంగా ప్రత్యేక చర్యలతో తీర్చిదిద్దామని తెలిపారు. ఆసియాలోని అనేక దేశాలలో స్పోర్ట్స్ మోటార్ సైక్లింగ్ ఔత్సాహికులకు ఎన్ఎస్ సీరిస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తమ ఉత్పత్తులన్నీ అధునాతన సాంకేతికత, ఫీచర్ల అప్ గ్రేడ్తో రూపొందిస్తున్నామని తెలిపారు.