● ప్రయాణికుడికి గాయాలు ● 15 ఏళ్ల బాలుడి అరెస్టు
తిరువొత్తియూరు: వేలూరు సమీపంలోని వానియం బాడికి చెందిన అబ్దుల్ కరీం (40) సెల్ఫోన్ సర్వీస్ దుకాణం నిర్వహిస్తున్నాడు. దుకాణానికి అవసరమైన విడిభాగాలను తీసుకోవడానికి చైన్నె అన్నాసాలై రిచ్ వీధికి వెళ్లాడు. అక్కడ మొబైల్ సర్వీస్ చేసేందుకు అవసరమైన వస్తువులను తీసుకొని సెంట్రల్ రైల్వే స్టేషన్కు వచ్చాడు. తరువాత ఏలగిరి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి వానియం బాడీకి బయలుదేరాడు. ఆ సమయంలో బేసిన్బ్రిడ్జి వద్ద హఠాత్తుగా అబ్దుల్ కరీం చేతిలోని మొ బైల్ ఫోన్ లాక్కోవడానికి ఓ బాలుడు ప్రయత్నించాడు. సమయంలో అదుపుతప్పి కింద పడిన అబ్దుల్ కరీం ఎడమ చేయి, ఎడమ మోకాలు ఎముకలు విరిగి పోయాయి. అబ్దుల్ కరీంను రైల్వే పోలీసులు స్టాండ్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అతనికి రక్తస్రావం కావడంతో అత్యవసర చికిత్స చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సంఘటనకు సంబంధించి చైన్నె చాకలిపేటకు చెందిన 15 సంవత్సరాల బాలుడిని చైన్నె సెంట్రల్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి, విచారణ చేపట్టారు. కాగా, ఆ బాలుడు అబ్దుల్ కరీం వద్ద సెల్ఫోన్ లాక్కున్న తర్వాత ఆటోలో ప్యారిస్కు వెళ్లి చోరీ చేసిన సెల్ ఫోను రూ.1700 విక్రయించినట్లు తెలిసింది. తర్వాత రెండు బీర్లు తాగి రూ. 500 ఆటో డ్రైవర్కు ఇచ్చినట్లు తెలిసింది. దీనికి సంబంధించి బాలుడిని కోర్టులో హాజరపరిచి జువైనల్ హోమ్ తరలించారు. ఈ సంఘటన చైన్నె బేసిన్ బ్రిడ్జి ప్రాంతంలో సంచలనం కలిగించింది.