సాక్షి, చైన్నె: వేసవి సెలవులను పొడిగించినా, ఖాతరు చేయకుండా అనేక ప్రైవేటు పాఠశాలలు గురువారం పునఃప్రారంభించడం చర్చకు దారి తీసింది. దీంతో అధికారులు కొరడా ఝుళిపించారు. రాష్ట్రంలో ఏప్రిల్ 28వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా నిర్ణయించిన మేరకు జూన్ 1 గురువారం 8 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలను తెరిచేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే, ఎండ ప్రభావం ఏ మాత్రం తగ్గని దృష్ట్యా, వేసవి సెలవులను జూన్7వ తేదీ వరకు పొడిగించారు. అయితే, అనేక ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్రంలో ఖాతరు చేయలేదు. ముందుగా నిర్ణయించినట్టుగా గురువారం పాఠశాలలను రీ ఓపెనింగ్ చేశాయి. విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రమే. ఈ సమాచారంతో విద్యాశాఖ అధికారుల ఆగ్రహానికి ప్రైవేటు పాఠశాలలు గురి కావాల్సి వచ్చింది. అధికారుల హెచ్చరికలతో ఆగమేఘాలపై విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. ఈ వ్యవహారాన్ని విద్యామంత్రి అన్బిల్ మహేశ్ తీవ్రంగా పరిగణించారు. ప్రైవేటు పాఠశాలలను హెచ్చరించారు. ఈనెల 7వ తేదీ నుంచే 2023–24 విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని, ముందుగానే పాఠశాలలను రీ ఓపెనింగ్ చేసిన పక్షంలో ఆయా యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ఆరోగ్యసంరక్షణ ప్రభుత్వానికి ముఖ్యమని, అందుకే వేసవి సెలవులు వారం రోజులు పొడిగించాల్సి వచ్చిందన్నారు.