సాక్షి, చైన్నె: చైన్నె – శ్రీలంకలోని కొన్ని హార్బర్లను కలుపుతూ పర్యాటక లగ్జరీ నౌక సేవలకు మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ వివరాలను చైన్నె హార్బర్ వర్గాలు ఓ ప్రకటన ద్వారా వెల్లడించాయి. చైన్నె నుంచి ఎంవీఎం ప్రెస్ పేరిట అంతర్జాతీయ పర్యాటక లగ్జరీ నౌక సేవలను కేంద్ర నౌకాయన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అనుమతిచ్చినట్లు వివరించారు. చైన్నె హార్బర్, ఎన్నూరు హార్బర్లలో ఉత్తమ సేవలను అందించిన వారికి మంత్రి చేతుల మీద సత్కారం జరిగినట్లు పేర్కొన్నారు. అలాగే తండయార్ పేటలోని హార్బర్ పాఠశాలలో పది, ప్లస్–2లో ఉత్తమ మార్కులు సాధించినవారికి ప్రోత్సహకాలను అందజేశామని వివరించారు.
నౌక పయనం..
హార్బర్ చైర్మన్ సునీల్ పాలీవాల్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైన్నె – శ్రీలకంలోని కాంగేశం, త్రికోణమలై, అంబన్ తోటా హార్బర్ను కలుపుతూ ఈ పర్యటక నౌక సేవలకు మంత్రి జెండా ఊపి ప్రారంభించినట్లు తెలిపారు. ప్రప్రథమంగా చైన్నె నుంచి శ్రీలంకకు పర్యాటక నౌక సేవలకు శ్రీకారం చుట్టామని, ప్రయాణికులు, పర్యాటకుల స్పందన మేరకు సేవలు విస్తృతం అవుతాయని వివరించారు. అలాగే చైన్నె హార్బర్ను పచ్చదనంతో నింపే విధంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.