తిరుపతి రూరల్: తుమ్మలగుంటలోని శ్రీకల్యాణ వెంకన్న ఆలయంలో ముక్కోటి ద్వాదశి రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ద్వాదశి పర్వదినాన వేలాది మంది భక్తులు వైకుంఠ ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తుమ్మలగుంటకు తరలివచ్చారు. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు నిరంతరాయంగా తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచారు. పోలీసులు వాహన పార్కింగ్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా చక్రస్నానం
వైకుంఠ ద్వాదశి పర్వదినాన తుమ్మలగుంట ఆలయం ఎదుట ఉన్న కోనేరులో సుదర్శన చక్రతాళ్వార్కు శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. అంతకుముందు అర్చకులు వేడుకగా తిరుమంజనం నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులకు దర్శనభాగ్యం కల్పించిన క్రమంలో సకల దోష నివృత్తికి చక్రత్తాళ్వార్కు చక్రస్నానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ ప్రధాన అర్చకులు అనంతాచార్యులు పేర్కొన్నారు.