స్వచ్ఛ బడి.. సేంద్రియ సిరి | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ బడి.. సేంద్రియ సిరి

Published Sat, Jul 1 2023 2:35 AM

Environmental conservation lessons that are paying off - Sakshi

సాక్షి, సిద్దిపేట :  సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ‘స్వచ్ఛ బడి’ సత్ఫలితాలు ఇస్తోంది. పట్టణంలోని ఒకటి రెండు కాదు, ఏకంగా 3 వేలకు పైగా ఇళ్లలో చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఈ ఎరు వును ఇంటిమేడపై సాగు చేస్తున్న మిద్దె తోటలకు వినియోగిస్తున్నారు. స్వచ్ఛ బడి ద్వారా నేర్చుకున్న పాఠాలను ఆచరణలో పెట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. చెత్త ఒక వ్యర్థం కాదని నిరూపిస్తు న్నారు.

ఇదే విధానాన్ని అందరూ అవలంబిస్తే పర్యావరణ కాలుష్యానికి కళ్లెం వేయడంతో పాటు చెత్త, డంపింగ్‌ యార్డుల సమస్యను చాలావరకు అధిగమించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ స్వచ్ఛబడిని సందర్శించిన మంత్రి కేటీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి బడులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 

స్వచ్ఛ బడి అంటే..
సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2021 ఏప్రిల్‌ 10న ఈ స్వచ్ఛ బడిని ప్రారంభించారు. ఎకరానికి పైగా విస్తీర్ణంలో దేశంలోనే రెండోదైన స్వచ్ఛ బడిని మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేశారు. ఇది అ..అంటే అమ్మ, ఆ..అంటే ఆవు లాంటి పదాలు ఇతర పాఠాలు బోధించే బడి కాదు.

పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగంపై ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వయసు గల వారికి పాఠాలు చెప్పే బడి. ఒకేసారి 50 మంది క్లాస్‌ వినే విధంగా దీనిని ఏర్పాటు చేశారు. వర్మీ కంపోస్టు యార్డు, పక్కనే పార్కు, డిజిటల్‌ తరగతి గది, హోం కమ్యూనిటీ కంపోస్టింగ్‌ ఏర్పాటు చేశారు.

సేంద్రియ ఎరువుల ద్వారా పండించే కూరగాయల తోట పెట్టారు. ప్లాస్టిక్‌తో కలిగే అనర్థాల గురించి తెలిసేలా చిత్రాలను వేశారు. ఇందులో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగంపై బోధించడంతో పాటు పనికి రాని వస్తువులతో వివిధ రకాల వస్తువులను తయారు చేయడం, ఖాళీ సీసాలతో స్వాగత తోరణాలు, వెదురు బొంగులతో ప్రహరీ ఏర్పాటు చేయడంపై శిక్షణ ఇస్తున్నారు. 

ఫోర్‌ ఆర్‌ పై శిక్షణ..
తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేయడం, ఫోర్‌ ఆర్‌.. అంటే రీయూజ్‌ (పునర్వినియోగం), రీసైకిల్‌ (తిరిగి తయారీ), రెఫ్యూజ్‌ (నిరాకరించడం), రెడ్యూస్‌ (తగ్గింపు) చేయడం కూడా నేర్పిస్తున్నారు. జీరో వేస్ట్‌ మేనేజ్‌మెంట్, తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారీపై ప్రత్యక్షంగా వివరిస్తున్నారు. ఇలా ఒక్క క్లాస్‌ రెండున్నర గంటల పాటు ఉంటుంది. ఈ బడిలో ఇప్పటివరకు 8వేల మందికి పైగా పాఠాలు విన్నారు.

రాష్ట్రం నలుమూ లల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల వారు విదేశీ యులు సైతం సందర్శించి స్వచ్ఛ బడి గురించి తెలుసుకుంటున్నారు. 15 మున్సి పాలిటీలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు క్లాస్‌లు విన్నారు. బెంగళూరుకు చెందిన డాక్టర్‌ శాంతి పర్యవేక్షణలో స్వచ్ఛ బడి కొనసాగు
తోంది. 

తడి చెత్తతో ఎరువు..
ప్రతి రోజూ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెత్త బండ్లు పట్ట ణంలోని గృహాలకు తిరిగి తడి, పొడిచెత్తను వేర్వేరుగా సేకరిస్తుంటాయి. పట్టణంలోని 43 వార్డుల్లో 41,322 గృహాలు, 1,57,026 జనాభా ఉంది. ఇందులో 3 వేలకు పైగా ఇళ్లలో తడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు.

కేవలం పొడి, హానికరమైన చెత్తను మాత్రం చెత్తబండికి అందజేస్తున్నారు. ఇలా ఇంట్లోనే తయారు చేసే సేంద్రియ ఎరువుతో కూరగాయలు బాగా కాస్తుండటంతో పట్టణవాసులు క్రమంగా దీని తయారీకి మొగ్గు చూపుతున్నారు. 

సేంద్రియ ఎరువుతో కూరగాయల సాగు
స్వచ్ఛ బడిలో పర్యావరణ పరిరక్షణ కోసం క్లాస్‌లు విన్నాను. అప్పటి నుంచి మా ఇంటి నుంచి తడి చెత్తను మున్సిపాలిటీ బండికి ఇవ్వడం మానేశా. దాన్ని ఉపయోగించి ఇంట్లోనే సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నా. దీనిని మిద్దెతోటలోని మొక్కలకు వేయడంతో కూరగాయలు, పూలు బాగా కాస్తున్నాయి.  
– గుడాల జ్యోతి, ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్, సిద్దిపేట

భవిష్యత్‌ తరాల కోసం..
బెంగళూరులో జీరో వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ గురించి తెలుసుకు న్నాం. డాక్టర్‌ శాంతి చెప్పిన మాటలు మాకు స్ఫూర్తిని ఇచ్చాయి. మంత్రి హరీశ్‌రావు చొరవతో సిద్దిపేటలోస్వచ్ఛ బడిని ఏర్పాటు చేసి పట్టణవాసులకు అవగాహన కల్పిస్తు న్నాం. భవిష్యత్‌ తరాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని దీనికి శ్రీకారం చుట్టాం.
– దీప్తి నాగరాజు, కౌన్సిలర్, స్వచ్ఛ బడి నిర్వాహకురాలు

Advertisement

తప్పక చదవండి

Advertisement