LB Nagar Flyover Collapse: గాయపడిన వారిని పరామర్శించిన కేటీఆర్
Published
Wed, Jun 21 2023 3:41 PM
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారి యోగక్షేమలు తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తుందని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. సంబంధిత వార్త: HYD: కుప్పకూలిన ఫ్లైఓవర్.. నలుగురి పరిస్థితి విషమం
జరిగిన ఘటన దురదృష్టకరమన్న కేటీఆర్, ఈ ప్రమాదం పట్ల పురపాలక శాఖ పూర్తిస్థాయి విచారణ చేపడుతుందని తెలిపారు. ప్రమాదానికి కారణమైన అంశాలపైన జీహెచ్ఎంసీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో ముగ్గురితో కూడిన కమిటీకి అదనంగా జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విచారణ చేయించి, ప్రమాద కారణాలను తెలుసుకుంటామన్నారు. వర్కింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం వలన ప్రమాదం జరిగితే కఠిన చర్యలు సైతం తీసుకుంటామన్నారు.