అన్ని అలవెన్సులు పెంపు.. 14 జీవోలు జారీచేసిన ఆర్థికశాఖ | Sakshi
Sakshi News home page

అన్ని అలవెన్సులు పెంపు..14 జీవోలు జారీచేసిన ఆర్థికశాఖ

Published Sat, Jun 24 2023 3:24 AM

Telangana government issue 14 GOs On  - Sakshi

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై సర్కారు వరాల జల్లు కురిపించింది. వారికి ఇచ్చే అన్ని రకాల అలవెన్సులు, అడ్వాన్సులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ మొత్తం 14 జీవోలను శుక్రవారం విడుదల చేసింది. 2020 పేస్కేల్‌ ఆధారంగా మొదటి వేతన సవరణ కమిషన్‌ ఇచి్చన సిఫారసుల మేరకు ఈ పెంపుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా 2008, 2011లో అలవెన్సుల సవరణ జరగలేదని అంతర్గతంగా పలుమార్లు చేసిన విజ్ఞ ప్తుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇక ఈ అలవెన్సుల పెంపుపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన కానుకగా ఆయన దీనిని అభివరి్ణంచారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. 

రూ. 4 లక్షల వరకు పెళ్లి అడ్వాన్సులు 
దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే భత్యాన్ని నెలకు రూ.2 వేల నుంచి, రూ.3 వేలకు, ఇళ్ల నిర్మాణ అడ్వాన్సును రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు, కారు కొనుగోలు అడ్వాన్సు పరిమితిని రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షలకు, ఉద్యోగుల కుమార్తెలు, కుమారుల పెళ్లిళ్ల అడ్వాన్సులను రూ.4 లక్షల వరకు పెంచింది. ఉద్యోగుల ప్రయాణ భత్యాన్ని, బదిలీపై వెళ్లినప్పుడు ఇచ్చే రవాణా భత్యాన్ని 30 శాతం చొప్పున పెంచగా, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇచ్చే స్పెషల్‌ కాంపెన్సేటరీ అలవెన్సును రూ.650 నుంచి రూ.1,280 వరకు పెంచింది. డ్రైవర్లు, లిఫ్టు ఆపరేటర్ల రోజువారీ గౌరవ వేతనాన్ని రూ.125 నుంచి రూ.150కి పెంచింది. వివిధ ప్రభుత్వ శిక్షణా సంస్థలు, పోలీసు విభాగం, ప్రొటోకాల్‌ సిబ్బందికి ఇచ్చే పలు రకాల అలవెన్సులు కూడా పెరిగాయి. 

విమాన ప్రయాణాల్లో వెసులుబాటు 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికారిక పనుల నిమిత్తం విమానాల్లో ప్రయాణించడానికి సంబంధించిన నిబంధనలను కొంతమేర సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణాన్ని ఎకానమీ క్లాస్‌లోనే చేయాల్సి ఉంటుంది. అయితే 15వ స్థాయి, అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఉండే ఐఏఎస్‌ అధికారులకు మాత్రం బిజినెస్‌ క్లాస్‌లోనూ ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. ఇక విమాన ప్రయాణ అనుమతి ఉన్న అధికారులందరికీ ఏసీ ఫస్ట్‌క్లాస్‌ రైలు ప్రయాణ సౌకర్యం కొనసాగనుంది. 

రోజువారీ భత్యం పెంపు 
అధికారిక పనులపై వెళ్లిన సందర్భంగా ఇచ్చే ఉద్యోగుల రోజువారీ భత్యాన్ని కూడా ప్రభుత్వం సవరించింది. ఇందుకోసం వేతన శ్లాబుల ఆధారంగా ఉద్యోగులను గ్రేడ్‌–1, 2, 3లుగా విభజించింది. అంతర్రాష్ట్ర ప్రయాణాల సందర్భంగా ఇచ్చే రోజువారీ భత్యాన్ని గ్రేడ్‌–1 ఉద్యోగులకు రూ.450 నుంచి రూ.600కు, గ్రేడ్‌–2 ఉద్యోగులకు రూ.300 నుంచి రూ.400కు, గ్రేడ్‌–3 ఉద్యోగులకు రూ.225 నుంచి రూ.330కు పెంచింది. అదే రాష్ట్రం బయటకు వెళ్లాల్సి వస్తే ఇవే గ్రేడ్‌ల ఆధారంగా భత్యాన్ని రూ.800, 600, 400కు పెంచారు. అదే విధంగా లాడ్జింగ్‌ చార్జీలను కూడా సవరించారు. 

రాజధానిలో ప్రయాణ భత్యం కూడా 
హైదరాబాద్, సికింద్రాబాద్‌ నగరాల్లోని ఉద్యోగులు అధికారిక పనుల నిమిత్తం చేసే ప్రయాణాలకు గాను కిలోమీటర్‌కు రూ.3 చొప్పున గరిష్టంగా రూ.60 వరకు క్లెయిమ్‌ చేసుకునే వెసులుబాటు కలి్పంచారు. తిరుగు ప్రయాణంలోనూ విడిగా క్లెయిమ్‌ చేసుకోవచ్చు. హైకోర్టు, ఇతర కోర్టులకు వెళ్లిన సందర్భంగా ప్రతి ఉద్యోగి రూ.75  క్లెయిమ్‌ చేసుకోవచ్చు. నెలలో గరిష్టంగా రూ.1,500 తీసుకోవచ్చు. కోర్టు సిబ్బంది న్యాయమూర్తుల నివాసాలకు వెళ్లినప్పుడు ప్రతిసారీ రూ.110,  నెలకు గరిష్టంగా రూ.4.400 వరకు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ అదనపు భత్యం కార్యాలయాలకు త్వరగా వచి్చ, ఆలస్యంగా వెళ్లినప్పుడు, సెలవు రోజుల్లో విధులకు వచ్చినప్పుడు వర్తించదు.  
బదిలీ రవాణా భత్యం సవరణ 
ప్రభుత్వ ఉద్యోగులు బదిలీ అయిన సందర్భంలో ఇచ్చే రవాణా భత్యాన్ని కూడా సవరించారు. ఇందుకోసం వేతన స్కేల్‌ ఆధారంగా జోనల్, ఇతర జోన్లు, ఇతర రాష్ట్రాలకు బదిలీ సందర్భంగా రవాణా చార్జీలను నిర్ధారించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ట్రావెల్‌ గ్రాంట్‌ను కూడా సవరించారు.

 డ్రైవర్లు, లిఫ్ట్‌ ఆపరేటర్లకు గౌరవ వేతనం పెంపు 
    రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే డ్రైవర్లు, లిఫ్ట్‌ ఆపరేటర్ల రోజువారీ గౌరవ వేతనాన్ని రూ.125 నుంచి రూ.150కు పెంచారు. ఈ జీవో ప్రకారం అధికారుల ప్రైవేటు పనులపై ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు కూడా డ్రైవర్లకు రూ.150 చెల్లిస్తారు. అయితే తొలిసారి మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది. ఆ తర్వాతి నుంచి సదరు అధికారి నుంచి వసూలు చేస్తారు. ఇక షెడ్యూల్డ్‌ ఏరియాల్లో పనిచేసే ఉద్యోగుల ప్రత్యేక పరిహార భత్యం (స్పెషల్‌ కాంపన్సేటరీ అలవెన్స్‌) కూడా పెరిగింది. మండల కేంద్రాల్లో ఈ ప్రత్యేక భత్యాన్ని వేతన శ్లాబుల ఆధారంగా రూ. 650 నుంచి రూ.1,280 వరకు పెంచారు. మండల కేంద్రాలు కాని గ్రామాలు, హామ్లెట్‌లలో రూ.780 నుంచి రూ.1,430 వరకు, కొండ ప్రాంతాల్లోని గ్రామాల్లో రూ.950 నుంచి రూ.1,660 వరకు పెంచారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపయోగించే కార్లు, మోటారు సైకిళ్లు, సైకిళ్ల నెలవారీ నిర్వహణ ఖర్చులను కూడా సవరించారు. మోటార్‌ కారు లేదా సైకిల్‌ నిర్వహణకు నెలకు ఇస్తున్న మొత్తాన్ని రూ.1,050 నుంచి రూ.1,500కు పెంచారు. వికలాంగ ఉద్యోగులకు రవాణా భత్యం బేసిక్‌ పేపై 10 శాతం, గరిష్టంగా రూ.3 వేలకు పెరిగింది.  

వడ్డీపై ఇంటి నిర్మాణ అడ్వాన్సు 
కట్టిన ఇళ్ల కొనుగోలు, స్థలం కొని ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులకిచ్చే అడ్వాన్సును ప్రభుత్వం పెంచింది. ఆయా స్కేళ్ల పరిధిలోనికి వచ్చే ఉద్యోగులకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అడ్వాన్సు ఇవ్వనుంది. గరిష్టంగా ఈ మొత్తాన్ని లేదంటే బేసిక్‌ పేపై 72 ఇంతల మొత్తాన్ని ఇవ్వనుంది. ఇందుకోసం గ్రూప్‌–4 ఉద్యోగుల నుంచి సాలీనా 5 శాతం, ఇతరుల నుంచి 5.50 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. ఐఏఎస్‌ అధికారులకు రూ.35 లక్షల వరకు అడ్వాన్సు ఇవ్వనుంది. వారి నుంచి కూడా 5.5 శాతం వడ్డీ వసూలు చేయనుంది. ఇంటి నిర్మాణ అడ్వాన్సును 300 విడతల్లో, మరమ్మతుల అడ్వాన్సును 90 విడతల్లో, స్థలం కొనుగోలు అడ్వాన్సును 72 విడతల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.  
కారు కొనుగోలు, పెళ్లి అడ్వాన్సులు.. 
    రూ.54,220 బేసిక్, ఆ పైన వేతనం ఉన్న ఉద్యోగులకు కారు కొనుగోలు కోసం రూ.9 లక్షల అడ్వాన్సు ఇస్తుంది. ఈ మొత్తాన్ని 135 విడతల్లో 5–5.5 శాతం వడ్డీతో తిరిగి వసూలు చేస్తుంది. బేసిక్‌పే రూ.32,810 పైన ఉన్న ఉద్యోగులకు మోటార్‌సైకిల్‌ కొనుగోలుకు రూ.లక్ష అడ్వాన్సు ఇస్తుంది. ఇక కుమారుల వివాహానికి క్లాస్‌–4 ఉద్యోగులైతే రూ. 2 లక్షలు, ఇతరులకు రూ.3 లక్షలు, కుమార్తెల వివాహానికి రూ.2.5 లక్షలు, రూ.4 లక్షల చొప్పున ఇస్తుంది. వ్యక్తిగత కంప్యూటర్‌ అడ్వాన్సు కింద రూ.50 వేలు, పండుగ అడ్వాన్సు కింద క్లాస్‌–4 ఉద్యోగులకు రూ.6 వేలు, ఇతరులకు రూ.8,500, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులకు ఎడ్యుకేషన్‌ అడ్వాన్సు కింద రూ.15,500 ఇస్తారు.  

ప్రొటోకాల్‌ ఉద్యోగులకు 15 శాతం స్పెషల్‌ పే 
    ప్రొటోకాల్‌ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు స్పెషల్‌ పే కింద బేసిక్‌పే మీద 15 శాతాన్ని అదనంగా చెల్లిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల పరిధిలోని శిక్షణా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, శిక్షకులకు స్పెషల్‌ పే, ప్రోత్సాహకాలను మొదటి వేతన సవరణ కమిషన్‌ సిఫారసు చేసిన విధంగా వేతనాలను పెంచి చెల్లించనుంది. ఉద్యోగుల ప్రయాణ భత్యాన్ని (టీఏ) కూడా ప్రభుత్వం సవరించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రూ.26,410–రూ.78,820 వేతన స్కేల్‌ పరిధిలోనికి వచ్చే ఉద్యోగులు కనీసం నెలలో 15 రోజుల పాటు పర్యటిస్తే మండల కేంద్రాల్లో అయితే రూ. 600, ఒకే రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని మూడు మండలాల పరిధిలో పర్యటిస్తే రూ. 700, రెవెన్యూ డివిజన్‌ మొత్తానికి రూ. 800 చొప్పున చెల్లిస్తారు. 20 రోజుల పాటు పర్యటిస్తే రూ.800, 900, 1,000 చొప్పున చెల్లిస్తారు. రూ.27,130–80,960 వేతన స్కేల్‌ పరిధిలోనికి వచ్చే ఉద్యోగులు నెలలో కనీసం 15 రోజులు పర్యటిస్తే రూ.800, 900, 1,000 చొప్పున, 20 రోజులు పర్యటిస్తే రూ.900, 1,000, 1,200 చొప్పున టీఏ చెల్లిస్తారు. పోలీసు కానిస్టేబుళ్లు, ఆక్టోపస్, యాంటీ నక్సల్స్‌ స్క్వాడ్, కౌంటర్‌ ఇంటిలిజెన్స్, ఎస్‌ఐబీ, ఏసీబీ తదితర విభాగాల్లో పని చేస్తున్న పోలీసు సిబ్బందికి స్పెషల్‌ అలవెన్సులు పెంచారు.  
పింఛన్‌దారులు మరణిస్తే... 
    రాష్ట్ర ప్రభుత్వ పింఛన్‌దారులు మరణిస్తే తక్షణ సాయం కింద ఇప్పటివరకు ఇస్తున్న రూ.20 వేలను రూ.30 వేలకు పెంచుతూ జీవో నం 65 విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం సర్వీసు పింఛన్‌దారులు లేదా ఫ్యామిలీ పింఛన్‌దారులు మరణిస్తే వారి నామినీలకు అదే రోజున ఈ తక్షణ సాయాన్ని అందిస్తారు.    

Advertisement
Advertisement