అత్యవసర వైద్యసేవలకు 466 వాహనాలు | Sakshi
Sakshi News home page

అత్యవసర వైద్యసేవలకు 466 వాహనాలు

Published Mon, Jul 31 2023 1:56 AM

466 vehicles for emergency medical services - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైద్యారోగ్యశాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవలకు కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. వీటిని వచ్చేనెల 1వ తేదీన ప్రారంభించా లని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు కొత్త వాహనాలను కొనుగోలు చేశారు.

108, 102 అనే హెల్ప్‌లైన్‌ సేవల నంబర్లు స్పష్టంగా కనిపించేలా బ్రాండింగ్‌ చేశారు. సీ ఎం కేసీఆర్‌ ఫొటో, తెలంగాణ ప్రభుత్వ లోగో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్థివ వాహనాల సేవలు ఉచితంగా అందిస్తామ నే విషయాన్ని తెలిపేవిధంగా ఉచితసేవ అని ముద్రించారు. 

అంబులెన్స్‌లు ఇలా... 
ప్రస్తుతం రాష్ట్రంలో 426 అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. 175 అంబులెన్సుల స్థానంలో కొత్తవి రిప్లేస్‌ చేస్తుండగా, మిగిలిన 29 అంబులెన్సులను అవసరమున్నట్టు గుర్తించిన కొత్త ప్రాంతాల్లో వినియోగించనున్నారు. కొత్తగా వచ్చే 204 వాహనాలను కలిపితే రాష్ట్రంలో 108 అంబులెన్సుల సంఖ్య 455కు పెరుగుతుంది.  

అమ్మ ఒడి వాహనాలు ఆకర్షణీయంగా 
గర్భిణుల కోసం ప్రవేశపెట్టిన అమ్మఒడి(102) వాహనాలు రాష్ట్రంలో 300 ఉన్నాయి. అయితే ఇందులో 228 వాహనాలకు కాలం చెల్లాయి. వాటి స్థానంలో కొత్తగా 228 వాహనాలను రీప్లేస్‌ చేస్తున్నారు. కొత్తగా అందుబాటులోకి రానున్న అమ్మఒడి వాహనాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

వాహనం వెనుకభాగంలో అమ్మకు ఆత్మీయతతో, బిడ్డకు ప్రేమతో అనే ట్యాగ్‌లైన్‌తో పాటు, సీఎం కేసీఆర్‌ ఓ బాలింతకు కేసీఆర్‌ కిట్‌ అందిస్తున్న ఫొటో ముద్రించారు. చూడటానికి ఆహ్లాదంగా ఉండే రంగుల్లో, అమ్మఒడి కార్యక్రమ లోగో, శిశువు ఫొటోలతో 102 వాహనాలు కొత్తలుక్‌ సంతరించుకున్నాయి. 

పార్థివ వాహనాలు 
ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో మరణించినవారి పార్థివదేహాలను స్వస్థలాలకు తరలించడం కుటుంబసభ్యులకు ఖర్చు తో కూడుకున్న పని. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొ ని ప్రభుత్వం ఉచితంగా హర్సే వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ హర్సే వాహనాలు 50 ఉన్నాయి. ఇందు లో 34 వాహనాలకు కాలం చెల్లిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా 34 వాహనాలను కొనుగోలు చేసి రిప్లేస్‌ చేస్తున్నది.

వైద్యసేవలు మరింత పటిష్టం – మంత్రి హరీశ్‌రావు 
అత్యవసర సమయాల్లో సేవలు అందించే కొన్ని వాహనాలకు కాలం చెల్లిపోవడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత వాహనాల స్థానంలో కొత్తవి సమకూర్చుకోవడంతో పాటు, అవసరమున్నట్టు గుర్తించిన కొత్త ప్రాంతాల్లో వాహనాల సేవలు విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. వీటి రాకతో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో మరింత వేగం పెరుగుతుంది.

ప్రజలకు అవసరమైన ఆరోగ్యసేవలు అందించే విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీపడటం లేదు. పెద్దమొత్తంలో నిధులు కేటాయించి వైద్యారోగ్య రంగాన్ని పటిష్టం చేసి, ఆరోగ్యరంగంలో తెలంగాణ దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల మన్ననలు పొందుతుండటం సంతోషకరం.

Advertisement

తప్పక చదవండి

Advertisement