నాగరాజు లాకర్లలో భారీగా బంగారం | Sakshi
Sakshi News home page

నాగరాజు లాకర్లలో భారీగా బంగారం

Published Thu, Oct 22 2020 2:34 PM

ACB Seized Gold In Keesara Nagaraju Bank Locker - Sakshi

సాక్షి, మేడ్చల్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు కోటి రూపాయల అవినీతి కేసులో ఏసీబీ దూసుడు పెంచింది. విచారణ ఎదుర్కొంటూ ఇటీవల ఆయన ఆత్మహత్యకు పాల్పడటంలో కేసును మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే అల్వాల్ ఐసీఐసీఐ బ్యాంక్‌లో నాగరాజు లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్‌ చేశారు. నాగరాజు బినామీ నందగోపాల్ పేరుతో ఉన్న ఈ లాకర్‌లో దాదాపు కేజీకిపైగా బంగారు ఆభరణాలను గుర్తించారు. బినామీ పేరుతో పెద్ద ఎత్తున్న ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించి ఏసీబీ... ఇతర ఖాతాలపై విచారణ చేస్తున్నారు. రెండు రోజలు క్రితం నందగోపాల్‌ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించగా.. లాకర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు లాకర్లు ఓపెన్‌ చేయగా.. పెద్ద ఎత్తున బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇంతకుముందు మరో బ్యాంక్‌ లాకర్లలో రెండు కేజీల బంగారాన్ని సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. (కీసర ఎమ్మార్వో మృతిపై సంచలన ఆరోపణలు)

ఆగస్టు 14వ తేదీన నాగరాజు ఇంటిపైన దాడి చేసిన సమయంలో ఏసీబీ అధికారులకు ఓ బ్యాంకు లాకర్‌కు చెందిన తాళంచెవి లభించింది. అది నాగరాజు బంధువైన జి.జే.నరేందర్‌ పేరిట అల్వాల్‌లోని సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు లాకర్‌గా ఏసీబీ గుర్తించింది. ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సమయంలోనూ నాగరాజు లాకర్‌ విషయంలో సహకరించలేదని సమాచారం. ఎట్టకేలకు సదరు లాకర్‌ను తెరిచిన ఏసీబీ అధికారులకు అందులో 1532 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. వాటిని సీజ్‌ చేసిన ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో డిపాజిట్‌ చేయనున్నారు. ప్రస్తుతం కేసులో పట్టుబడ్డ నిందితులంతా చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు.
 

Advertisement
Advertisement