ప్రజల దృష్టిని మళ్లించేందుకే యూసీసీ | Sakshi
Sakshi News home page

ప్రజల దృష్టిని మళ్లించేందుకే యూసీసీ

Published Sat, Jul 15 2023 1:33 AM

Asaduddin Owaisi Submits Response To Law Commission On Ucc - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, చైనా చొరబాటు లాంటి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఉమ్మ డి పౌరస్మృతి (యూసీసీ) అమలు ప్రతిపాదన తెచ్చారని హైదరాబాద్‌ ఎంపీ, ఆల్‌ ఇండియా మజ్లిస్‌–ఏ–ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు.

శుక్రవారం మజ్లిస్‌ పార్టీ ప్రధాన కార్యాలయమైన దారుస్సలాంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యూసీసీ అమలు గురించి తెలంగాణలోని ఆదిలాబాద్‌కు వచ్చి గోండు సామాజిక వర్గానికి చెప్పాలని ప్రధాని మోదీకి సవాల్‌ విసిరారు. గతంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తిందని, వచ్చే 2024 ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందడమే దాని లక్ష్యమని ఒవైసీ ధ్వజమెత్తారు.

కామన్‌ లా కోడ్‌పై సూచనల కోసం అప్పీల్‌ చేసిన లా కమిషన్‌కు యూసీసీపై తమ పార్టీ స్పందనను పంపామని వివరించారు. ఇటీవల, భోపాల్‌లో ప్రధాని మోదీ యూసీసీపై ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని వాఖ్యానించారని, ‘ఒక ఇంట్లో ఒక సభ్యునికి ఒక చట్టం, మరొకరికి మరొక చట్టం ఉంటే ఆ ఇంటిని నడపగలమా? అని ప్రశ్నించారు. యూనిఫాం సివిల్‌ కోడ్‌పై కేరళ గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ మండిపడ్డారు. 

ఏపీ సీఎం జగన్‌ను కలుస్తా 
ఏపీ సీఎం జగన్‌ తనకు మిత్రుడని, త్వరలో ఆయనను యూసీసీ అంశంపై కలుస్తామని అ సదుద్దీన్‌ ఓవైసీ వెల్లడించారు. ఇప్పటికే ఆయన తనను లంచ్‌కు ఆహ్వానించారని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశమై యూసీసీకి వ్యతిరేకంగా మద్దతు కోరగా, ఆయ న సానుకూలంగా స్పందించడంతో పాటు భావస్వారూప్య పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు.

Advertisement
Advertisement