Sakshi News home page

Bairi Naresh: నేను ఎక్కడికి పారిపోలేదు

Published Tue, Jan 2 2024 10:32 AM

Bairi Naresh Reaction To The Attack On Ayyappa Devotee - Sakshi

సాక్షి, ములుగు: తాను ఎక్కడికి పారిపోలేదు.. ఎవరిపైనా దాడి చేయలేదని నాస్తికుడు బైరి నరేష్‌ అన్నారు.  తాను దాడి చేశానన్న వార్తలో నిజం లేదన్నారు.  కాగా, అయ్యప్ప భక్తుని కారుతో ఢీకొట్టిన ఘటనలో ఏటూరు నాగారం పీఎస్‌లో బైరి నరేష్‌పై కేసు నమోదైంది. అయ్యప్ప భక్తుడిని వాహనంతో ఢీకొట్టి గాయపర్చిన ఘటనలో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటన అనంతరం మంగపేట వైపు వెళ్తుండగా నరేష్‌ వాహనం ప్రమాదానికి గురైంది. జీడివాగు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. సకాలంలో ఎయిర్ బెలూన్లు ఓపెన్ అవడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఘటన తర్వాత వాహనం అక్కడే వదిలేసి నరేష్‌ బస్సులో వెళ్లిపోయారు. వాహనం ప్రమాదంపై మరో కేసు నమోదైంది. బైరి నరేష్‌ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. బైరి నరేష్ స్వగ్రామం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు.

ఏడాది కిందట.. అయ్యప్ప స్వామి పుట్టుక గురించి బైరి నరేష్‌ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. హిందూ సంఘాలు, అయ్యప్ప స్వాముల ఫిర్యాదు నేపథ్యంతో కేసు నమోదు అయ్యింది. దాదాపు 45 రోజుల పాటు నరేష్ చర్లపల్లి జైలులో ఉన్నాడు. కోడంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చాక కూడా నరేష్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. హనుమకొండలో మరోసారి అయ్యప్ప భక్తులు దాడి చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు అప్పుడు పోలీసుల విచారణలో బైరి నరేష్‌ అంగీకరించాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement