Basara IIIT Protests Issue: BJP Bandi Sanjay Letter To CM KCR, Details Inside - Sakshi
Sakshi News home page

Bandi Sanjay Letter To KCR: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ ఘాటు లేఖ

Published Mon, Jun 20 2022 6:04 PM

Bandi Sanjay Letter To CM KCR Over Basara IIIT Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాసర ట్రిపుల్‌ ఐటి విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఘాటు లేఖ రాశారు. బాసర ట్రిపుల్‌ ఐటి విద్యార్థుల న్యాయమైన సమస్యలపై ‘‘నిరో చక్రవర్తి’’ గా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని లేఖలో దుయ్యబట్టారు. బాసర ట్రిపుల్‌ విద్యార్థుల న్యాయమైన 12 డిమాండ్లను వెంటనే ఆమోదించి వాటిని పరిష్కరించాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.
చదవండి: హైదరాబాద్‌ ప్రజలకు ఊపిరి ఆడట్లే.. కారణాలివే!

‘‘జాతీయపార్టీ ఏర్పాటుపై, పొలిటికల్‌ స్ట్రాటజిస్టులతో, తెలంగాణ ద్రోహులతో సమావేశం అవడానికి మీకు సమయం ఉంటుంది, కానీ గత 6 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మాత్రం కేసీఆర్‌కు సమయం చిక్కదు. కేటీఆర్‌ విదేశీ పర్యటనకు, కేసీఆర్‌ వ్యక్తిగత ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తారు గానీ, ఉన్నత విద్యకు, విద్యార్థుల న్యాయమైన కోరికల పరిష్కారం కోసం నిధుల కేటాయించడానికి మాత్రం నిధులుండవు. బాసర ట్రిపుల్‌ ఐటి విద్యార్థుల డిమాండ్లను  సిల్లీ డిమాండ్లుగా పేర్కొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి బేషరతుగా  విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని’’ బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

‘‘మంత్రులు, అధికారులు, విద్యార్థులతో మైండ్‌ గేమ్‌ ఆడటం మానుకోవాలి. గోబల్స్‌కు వారసులైన రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులతో సమస్య పరిష్కారమైందని తప్పుడు ప్రచారం చేయడం రాష్ట్రప్రభుత్వం దివాళ కోరుతనానికి నిదర్శనం. మంత్రులు, అధికారులు, పోలీసులు, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తున్నారు. బాసర ట్రిపుల్‌ ఐటి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. బాసర ట్రిపుల్‌ ఐటి సమస్యలపై అన్ని విద్యార్థిసంఘాలతో ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేయాలని’’ లేఖలో బండి సంజయ్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement