రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయిస్తా  | Sakshi
Sakshi News home page

రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయిస్తా 

Published Fri, Oct 14 2022 1:22 AM

BJP Munugode Candidate Komatireddy Rajagopal Reddy About Munugode Development - Sakshi

మునుగోడు: కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మునుగోడు నియోజకవర్గానికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తానని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హామీనిచ్చారు. గొల్ల కురుమలకు గొర్రెల కోసం ఇచ్చిన నగదు బ్యాంకుల్లో ఫ్రీజింగ్‌ చేయించి తమకు ఓట్లు వేస్తేనే ఇస్తామని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారని, దీనిపై ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. ఎన్నికలు అయిన తరువాత కేంద్ర మంత్రులతో మాట్లాడి నగదు ఇప్పిస్తానని, ఒకవేళ బ్యాంక్‌ అధికారులు ఇవ్వకపోతే హైదరాబాద్‌లోని తన 90 కోట్ల ఆస్తిని అమ్మి ఇస్తానని ప్రకటించారు.

ఆయన గురువారం మునుగోడు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. మునుగోడుకు నిధులు మంజూరు చేయాలని మూడున్నరేళ్లుగా తాను అసెంబ్లీలో గొంతుచించుకొని అడిగినా కేసీఆర్‌ పభ్రుత్వం నయాపైసా ఇవ్వలేదన్నారు. తనను నమ్ముకున్న ప్రజలకు ఏమీచేయలేకపోయానని, రాజీనామా చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని భావించి.. ఏడాది సమయం ఉన్నప్పటికీ పదవికి రాజీనామా చేశానని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సీఎం అవుతానని కలలు కంటున్నాడని, అది నిజ జీవితంలో జరిగే పని కాదన్నారు. ఏదైనా సినిమాలో నటించి సీఎం పాత్ర పోషించుకోవాలని హితవు పలికారు.

Advertisement
Advertisement