TS Bodhan Assembly Constituency: TS Election 2023: బోధన్ నియోజక వర్గం.. ఆసక్తికర అంశాలు!
Sakshi News home page

TS Election 2023: బోధన్ నియోజక వర్గం.. ఆసక్తికర అంశాలు!

Published Tue, Sep 19 2023 11:21 AM

Bodhan Constituency Interesting Facts - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: బోధన్ నియోజక వర్గంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల సమస్య ప్రభావితం చేస్తోంది.  నవీపేట మండలంలోని మాటు కాలువ 12 కిలో మీటర్ల పొడవున ఐదు గ్రామాల శివారులో జన్నెపల్లి, సిరన్‌పల్లి, లింగాపూర్, నిజాంపూర్, తుంగిని ఆయకట్టు 2 వేల ఎకరాల వరకు ఉంది. ఈ కాలువ గండిపడి రైతులు ఏళ్లకాలంగా నష్టపోతున్నారు. ఈ సమస్య ఎన్నికలపై ప్రభావితం చూపే అవకాశాలుంటాయి. బోధన్‌లో మూతపడి ఉన్న నిజాం షుగర్స్‌ ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారబోతుంది.

అధికారంలోకి వస్తే 100 రోజుల్లోగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని తెరిపిస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ 2014 ఎన్నికల ముందు ప్రకటించింది.. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన తాజా హామీల్లో 2లక్షల పంట రుణమాఫీ, రూ. 500 లకే సిలిండర్‌  హామీలు గ్రామాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి. రాజకీయపరంగా.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ లో నాయకుల మధ్య అంతర్గత విబేధాలు ఎన్నికల ఫలితాల పై ప్రభావం చూపేందుకు అవకాశాలున్నాయి.

అతి పెద్ద మండలం, ప్రభావితం చూపే పంచాయతీ..
అతి పెద్ద మండలం: నవీపేట
ప్రభావితం చేసే పంచాయతీలు: నవీపేట, ఎడపల్లి, సాలూర

నియోజక వర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య..
మొత్తం ఓటర్ల సంఖ్య:   2,04218
మహిళలు: 1,06226
పురుషులు: 97,989
ఇతరులు: 03
కొత్త ఓటర్లు: 12,300

వృత్తిపరంగా ఓటర్లు..
ఈ నియోజక వర్గంలో రైతులు ఎక్కువ

మతం/కులం పరంగా ఓటర్లు?
బీసీ ఓటర్లు: 1 లక్ష వరకు
ఎస్సీ,ఎస్టీలు: 30 వేలు
క్రిస్టియన్‌లు: 8500
ముస్లీం మైనార్టీలు: 50 వేలు
ఇతరులు, రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణులు: 18500 (మున్నూర్‌కాపు, పద్మశాలి, లింగాయత్‌లు, గూండ్ల, గొల్లకుర్మలు, ముదిరాజ్‌ సంఖ్య అధికంగా ఉంటుంది.)

నియోజక వర్గంలో భౌగోళిక పరిస్థితులు..
నియోజక వర్గం అంచున మంజీర, గోదావరినదులు ఉంటాయి. మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చే గోదావరి నది రెంజల్‌ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం వద్ద తెలుగు నేలపై అడుగు పెడుతోంది. త్రివేణి సంగమ క్షేత్రం వద్ద గోదావరి పుష్కరాలు నిర్వహిస్తారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకులు కేశవరావు బలిరాం హెగ్డెవార్‌ పూర్వీకుల గ్రామం కందకుర్తి (రెంజల్‌ మండలం) నవీపేట మండలానికి నిర్మల్‌ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం సమీపంలో ఉంటుంది.

బోధన్‌లో ఆసియా ఖండంలోనే ఖ్యాతి గడించిన  నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ ఉంది. మూతపడింది. ఎడపల్లి మండలంలోని జాన్కంపే – ఠానాకలాన్‌ గ్రామాల మధ్య అలీసాగర్‌ రిజర్వాయర్, ఉద్యావనం పర్యాటక కేంద్రంగా ఉంది. నవీపేట మండలంలోని కోస్లీవద్ద గోదావరి నదిపై అలీసాగర్‌ ఎత్తిపోతల పథకం నిర్మించారు. 51 వేల ఎకరాలకు సాగు నీరందిస్తోంది.. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాల్లో ఉంటుంది. బోధన్‌లో ప్రముఖ ఏకచక్రేశ్వరాలయం ఉంది. నియోజక వర్గానికి మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది.

ఆసక్తికర అంశాలు..
బోధన్ ఎమ్మెల్యే షకీల్ తెలంగాణలోనే ఏకైక ముస్లిం ఎమ్మెల్యే.. వరుసగా రెండుసార్లు గెలిచారు.. హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. అయితే ఇక్కడ మిమ్‌ పార్టీ సహకారం ముస్లింల సహకారం ఎన్నికల్లో ప్రభావితం చూపిస్తుంది.. కానీ మిమ్‌ నేతలకు ఎమ్మెల్యే షకీల్కు మధ్య సంబంధాలు చెడి పోయాయి.. ఆ పార్టీ నేతలు ఎనిమిది మందిపై ఎమ్మెల్యే హత్యాయత్నం కేసు పెట్టారు.. దాంతో నేతలు అరెస్టు అయ్యి జైలుకు వెళ్లారు.. వారిని మిమ్‌ అధినేత అసదుద్దీన్ ఓవైసీ జైలుకు వెళ్లి పరామర్శించి బోధన్ లో యుద్ధం ప్రకటించారు.. ఇటీవల జరిగిన ఈ పరిణామంతో మిమ్‌ బోధన్ లో బీఆర్‌ఎస్‌కు సహకరించే పరిస్తితి లేదు. షకీల్ను మారిస్తే మనసు మారొచ్చు.

ఇతర రాజకీయ అంశాలు..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి పోటీలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్‌కు చెందిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తూము పద్మ భర్త శరత్‌రెడ్డి, ఎమ్మెల్యే షకీల్‌ మధ్య అంతర్గత విబేదాలు రచ్చకెక్కాయి. శరత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ , ఎంఐఎం పార్టీ ముఖ్య నాయకులతో టచ్‌లో ఉన్నారు. బీజేపీ నాయకులతో టచ్‌లో ఉన్నారు.

ఎమ్మెల్సీకవిత, జిల్లా మంత్రి ప్రశాంత్‌ రెడ్డిని కలిసి ఎమ్మెల్యే షకీల్‌కు మళ్లీ టిక్కెట్‌ ఇస్తే సహకరించేది లేదని ,ఓడిస్తామని తూము శరత్‌రెడ్డి తేల్చి చెప్పారు. మిత్ర పక్షంగా ఉన్న ఎంఐఎం నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఎమ్మెల్యేను అడ్డగించిన ఎంఐఎం ఇద్దరు నాయకులను హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement