ఆణిముత్యం లాంటి హారీశ్‌ను ఇచ్చా : కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

సిద్దిపేట నా ప్రాణం: సీఎం కేసీఆర్‌

Published Thu, Dec 10 2020 4:32 PM

CM KCR Siddipet Tour: KCR Praises Harish Rao - Sakshi

సాక్షి, సిద్దిపేట : ఆర్థికమంత్రి హరీశ్‌ రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశంసల జల్లు కురిపించారు. జిల్లాను మంత్రి హరీశ్‌ అన్ని రకాలుగా అభివృద్ధి చేసి తన పేరును నిలబెట్టాడని కొనియాడారు. గురువారం ఆయన సి‍ద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో కలిసి రూ.45 కోట్లతో సిద్ధిపేట శివారులో నిర్మించనున్న ఐటీ టవర్ నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. ఆనంతరం ఆయన సిద్దిపేట గవర్నమెంట్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. సిద్దిపేటను మంత్రి హరీశ్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. హరీశ్ హుషారైన నేతని, ఆయన నేతృత్వంలో సిద్ధిపేటలో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. తన పేరును కాపాడి హరీశ్ సిద్ధిపేటను అభివృద్ధి చేశారని చెప్పారు. సిద్దిపేట పేరులోనే బలముందని, తెలంగాణ సాధించిన పేట అన్నారు.

సిద్దిపేట అంటే తనకు ప్రాణమని చెప్పారు. ‘సిద్దిపేట లేకపోతే కేసీఆర్‌ లేడు.. కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ లేదు’ అని సీఎం పేర్కొన్నారు. జిల్లాలో కరెంటు బాధలు, నీళ్ల బాధలు లేకుండా చేశామన్నారు. రంగనాయకసాగర్‌ను టూరిస్ట్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రంగనాయకసాగర్‌ పర్యాటక అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించారు. అలాగే రుకోడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు రూ.80 కోట్లు మంజూరు చేశారు. 

Advertisement
Advertisement