ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా... | Sakshi
Sakshi News home page

ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా...

Published Mon, Jan 8 2024 2:42 AM

cm revanth reddy tweet about one month rule in telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తాను’ అని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. నెల రోజుల పాలనపై ఆదివారం ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం సంతృప్తినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.

సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ, పాలనను ప్రజలకు చేరువ చేస్తూ, అన్నగా నేనున్నానని రేవంత్‌ భరోసా ఇచ్చారు. నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. మన ఆడబిడ్డల మొహంలో ఆనందాలు చూస్తూ, రైతుకు భరోసా ఇస్తూ సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోందన్నారు. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ, మత్తులేని చైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. 

Advertisement
Advertisement