గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు | Sakshi
Sakshi News home page

గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

Published Wed, Dec 14 2022 1:21 PM

Congress Leaders Detained For Protest Police Raid On War Room HYD - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లిలోని గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్‌ స్ట్రాటజీ టీమ్‌ హెడ్‌ ఆఫీస్‌ను సీజ్‌ చేయడంపై తెలంగాణ కాంగ్రెస్‌ నిరసన వ్యక్తం చేస్తోంది. వార్‌రూమ్‌లో డేటాను ధ్వంసం చేశారని కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టింది. పలుచోట్ల కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రగతి భవన్‌ ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం గాంధీభవన్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

కాగా మాదాపూర్‌లోని తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.

ఎస్‌కే కార్యాలయంపై పోలీసుల దాడిని కాంగ్రెస్‌ నేతలు ఖండించారు.సునీల్‌ కార్యాలయాన్ని కుట్రపూరితంగా సీజ్‌ చేశారని ఆరోపించారు. ప్రభుత్వ, పోలీసు చర్యలకు నిరసనగా బుధవారం నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో పాటు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు.
చదవండి: ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

Advertisement
Advertisement