వావ్ వైజాగ్ అనేలా మార్చారు..!
● విశాఖ సుందరిలా తీర్చిదిద్దారు ● రోడ్లు, పార్కులు, బీచ్లు సుందరీకరణ ● ఐదేళ్లలో మారిన నగర రూపురేఖలు ● ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు ● పాలనలో జగన్ సరికొత్త ఒరవడి ● ఆయన మళ్లీ సీఎం కాకపోతే పథకాలు ఆగిపోతాయని మహిళల్లో భయం ● స్నీపర్ పార్కులోని ‘రచ్చబండ’లో సీతమ్మధార మహిళల మనోగతం సాక్షి, విశాఖపట్నం/సీతమ్మధార: ‘ఒకప్పటి వైజాగ్కి, ఇప్పటి వైజాగ్కి ఎంత తేడా? నల్ల తాచుల్లాంటి తారు రోడ్లు.. సకల సదుపాయాలతో పార్కులు, బీచ్లు.. ప్రపంచ ప్రఖ్యాత ఇనార్బిట్ మాల్, ఇన్ఫోసిస్, అదానీ డేటా సెంటర్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా? రెండా? ఎన్నో, మరెన్నో అభివృద్ధి పనులు విశాఖ విశిష్టతను మరింత పెంచాయి. నగర స్వరూపాన్ని, రూపు రేఖలనూ మార్చాయి. వైజాగ్ సుందరిని మరింత సౌందర్యంగా తీర్చి దిద్దాయి. మా పిల్లలతో బయటకు వెళితే.. వావ్.. ఇది మన వైజాగేనా? అనిపిస్తోంది. ఈ ఐదేళ్లలోనే ఇంతలా మారిపోయిందా? అని ఆశ్చర్యమేస్తోంది. ఎటు చూసినా అభివృద్ధి చేసిన ఈ పార్కులు, బీచ్ల్లోనూ కూర్చుంటే ఎంతసేపైనా ఇంటికి వెళ్లాలనిపించడం లేదు. ఇలా నగర రమణీయతను ఎంతలా ఆస్వాదించినా తనివి తీరడం లేదు. ఇక మహిళలకు సంక్షేమ పథకాలు, వలంటీర్లు, సచివాలయ వ్యవస్థల ద్వారా సేవలు, ప్రతి నెలా ఒకటో తారీఖున ఇంటికే పెన్షన్లు.. లంచాలకు ఆస్కారం లేకుండా జనం కోరుకునే సుపరిపాలనను జగన్మోహన్రెడ్డి అందిస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలి. ఆయనొస్తేనే విశాఖకు మరింత అభివృద్ధి జరుగుతుంది. ఆయన కాకుండా మరెవరొచ్చినా ఇప్పుడు అందుతున్న సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి.. నో డౌట్!’అంటూ విశాఖ నగరంలోని సీతమ్మధార స్నీపర్ పార్కులో వాహ్యాళికి వచ్చిన ఉన్నత వర్గాలకు చెందిన కొందరు మహిళలు సేద తీరుతూ చర్చించుకుంటున్నారు. ‘సాక్షి’ వారిని పలకరించినప్పుడు తమ మనసులో భావాలను ఇలా పంచుకున్నారు. మేలు పొందిన వారు జగన్కే ఓటేస్తారు..
వైఎస్సార్సీపీ గవర్నమెంటు వచ్చాక వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు ఎంతో మేలు పొందారు. పెన్షన్లు ఇంటికే తెచ్చి ఇస్తున్నారు. గతంలో ఏ గవర్నమెంటూ ఇలా చేయలేదు. అందుకే పెన్షన్లు, స్కీములు అందుకుంటున్న వారంతా సీఎం జగన్కే ఓటేస్తారు. వైజాగ్ డెవలప్ చేస్తుండడం వల్ల ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి.
– సుభద్ర, గృహిణి, సీతమ్మధార
ఎమ్మెల్యే కాకపోయినా ఎంతో అభివృద్ధి..
గత ఎలక్షన్లో పోటీ చేసి ఓడినా కేకే రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గం అభివృద్ధికి పాటు పడుతూనే ఉన్నారు. ఇక్కడ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పత్తా లేకుండా పోయారు. కేకే రాజు నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. రోడ్లు, పార్కులు అభివృద్ధి చేశారు. ఈసారి ఇక్కడ కేకే రాజును, అక్కడ వైఎస్ జగన్ను గెలిపించుకుంటాం.
– కె.ఉదయలక్ష్మి, సీతమ్మధార
పథకాలకు మహిళలు ఖుషీ
ముఖ్యమంత్రి జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలతో మహిళలు చాలా ఖుషీ అవుతున్నారు. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, ఆరోగ్యశ్రీలే కాదు.. వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకు ఇంటికే పెన్షన్ల సొమ్ము ఠంచనుగా ఒకటో తారీఖునే తెచ్చి ఇవ్వడం గొప్ప విషయం కదా? ఇలాంటి పరిస్థితి గత ప్రభుత్వంలోనూ లేదు.. ఇతర రాష్ట్రాల్లోనూ లేదు. ఈ స్కీములు అందుకునే వారు ఒక్క రూపాయి లంచం కూడా ఇవ్వడం లేదు. అందుకే వీరంతా మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారు.
– యు.శ్రీలత, సీతమ్మధార
జగన్ ప్రభుత్వంలో ఆనందంగా మహిళలు
జగనొచ్చాక తమలాంటి వారికి ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ అందుతున్నాయని చాలామంది మహిళలు సంతోషంగా చెప్పుకుంటున్నారు. మళ్లీ ఆయన సీఎం కాకపోతే ఇప్పుడిస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని వారు భయపడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేడీస్ ఇంత ఆనందంగా ఉండే వారు కాదు. – మారుతి, సీతమ్మధార