బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థినులకు వేధింపులు? | Sakshi
Sakshi News home page

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థినులకు వేధింపులు?

Published Fri, Nov 25 2022 9:14 AM

Harassment in Basara IIIT: Two College Employees Were Suspended - Sakshi

సాక్షి, నిర్మల్‌: నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థినులను వేధించిన ఘటనలో బుధవారం ఇద్దరు కళాశాల ఉద్యోగులపై అధికారులు వేటు వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఓ శాఖ­లోని అటెండర్‌ విద్యార్థినులను బ్లాక్‌మెయిల్‌ చేయగా.. అధికారులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బయటపడినట్టు తెలుస్తోంది.  ఆ విద్యార్థిని ఇచ్చిన ఆధారాల ప్రకారం ఉద్యోగుల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రహస్య విచారణ చేస్తున్నట్లు సమాచారం.

తనకు దగ్గరి బంధువులు కావడంతో పలకరించేవాడినని సదరు ఉద్యోగి చెప్పగా, అతని భార్యను కళాశాల లోని భవనంలో అధికారులు రహస్యంగా విచారించినట్టు తెలిసింది. సదరు విద్యార్థినులతో తమకు  బంధుత్వం లేదని ఆమె స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. వ్యవహారాన్ని ఉన్నతాధికారులకు వివరించిన కళాశాల అధికారులు ఓ కమిటీ వేసి రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.

కాగా, మరో ఉద్యోగికి సైతం ఈ వ్యవహారంతో సంబంధం ఉండగా.. తను విధులు నిర్వర్తించే సెక్షన్‌లో అవకతవకలకు పాల్పడినందుకు వేటు వేసినట్లు కళాశాల వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై కళాశాల డైరెక్టర్‌ సతీ‹Ùను సంప్రదించగా.. కొందరు కళాశాల నియమాలను అతిక్రమించినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిపై ఏకసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఏ అంశంపై కమిటీని ఏర్పాటు చేశారని ప్రశ్నించగా జవాబు దాటవేశారు.
చదవండి: Hyderabad: ట్రాఫిక్‌ చిక్కులకు చెక్‌.. ఐటీ కారిడార్‌లో ఇక రయ్‌ రయ్‌!   

Advertisement
Advertisement