తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌? | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌?

Published Thu, Feb 9 2023 2:23 AM

Hyderabad: Mla Quota Mlc Election Likely To Release Notification In Coming Days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశముంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి ఎన్నికైన ముగ్గురు సభ్యుల పదవీ కాలం మార్చి 29న ముగియనుంది. వచ్చే నెల 29 నాటికి ఎమ్మెల్సీలుగా తమ ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న వారిలో వి.గంగాధర్‌ గౌడ్, కుర్మయ్యగారి నవీన్‌కుమార్, ఎలిమినేటి కృష్ణారెడ్డి ఉన్నారు.

వీరి స్థానంలో కొత్త సభ్యులను ఎన్నుకునేందుకు షెడ్యూలు విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే 40 మంది సభ్యులున్న తెలంగాణ శాసన మండలిలో ముగ్గురు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలతో పాటు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ సయ్యద్‌ అమీనుల్‌ హసన్‌ జాఫ్రీ (ఎంఐఎం), ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మే నెలలో ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటున్నారు. వీరి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ కూడా ఏప్రిల్‌లో విడుదల కానున్నది.

Advertisement
Advertisement