Sakshi News home page

సో.మీ. దెబ్బ: కుమారి ఆంటీకి బిగ్‌ షాక్‌.. ఫుడ్‌ బిజినెస్‌ క్లోజ్‌ చేయించిన పోలీసులు

Published Tue, Jan 30 2024 8:05 PM

Hyderabad Police Big Shock to Street Food Kumari Aunty - Sakshi

నాన్నా.. నాన్నా.. అంటూ కొసరి కొసరి వడ్డిస్తూ.. టూ లివర్స్‌ ఎక్స్‌ట్రా మీది మొత్తం థౌజండ్‌ అయ్యిందని సోషల్ మీడియాను షాక్‌ అయ్యేలా చేసి ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ ఆంటీ కుమారి. అయితే తాజాగా ఆమెకు షాక్‌ ఇచ్చారు పోలీసులు. ఆమె ఫుడ్‌ కోర్టును బంద్‌ చేయించగా.. తనకు మాత్రమే బంద్‌ చేయించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

ఏ సోషల్‌ మీడియా అయితే ఆమెను ఫేమస్‌ చేసిందో.. అదే ఆమెకు దెబ్బేసింది. ఆమె వీడియోలు వైరల్‌ అయ్యాక ఆ ఫుడ్‌ కోర్టుకు జనాలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో జనం వస్తుండడం.. వాహనాల పార్కింగ్‌తో ఈ మధ్య మాదాపూర్‌లోని ఆమె ఫుడ్‌ కోర్టు వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. దీంతో మంగళవారం నాడు పోలీసులు రంగంలోకి దిగారు.  ఆమె ఫుడ్‌కోర్టును అక్కడి నుంచి తరలించారని ఆదేశించారు. వారం పాటు దుకాణం బంద్‌ చేయాలని.. ఈలోపు జీహెచ్‌ఎంసీ సమన్వయంతో మరో దగ్గర ఫుడ్‌ కోర్టు తెరుచుకోవాలని ఆమెకు సూచించారు.  

కుమారి ఆంటీ పూర్తి పేరు దాసరి సాయి కుమారి. ఆమె స్వస్థలం ఏపీలోని గుడివాడ. నగరంలోని మాదాపూర్‌లోని కోహినూరు హోటల్ ఎదురుగా 2011లో స్ట్రీట్‌ఫుడ్‌ సెంటర్‌ను ప్రారంభించింది. మొదట్లో కేవలం 5 కేజీల రైస్‌తో ప్రారంభమైన కుమారి ఫుడ్‌ బిజినెస్‌.. ఇప్పుడు రోజుకు 100 కేజీలకు పైగానే అమ్ముడుపోతోందట!. ప్రేమగా వడ్డించే ఆమె విధానంతో పాటు అక్కడి రేట్లు కూడా సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. దీంతో.. ఆమె ఓ సెన్సెషన్‌గా మారిపోయారు.

ట్రాఫిక్ పోలీసులు బిజినెస్ క్లోజ్ చేయటంపై కుమారి ఆంటీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు తన ఒక్కరి బండి మాత్రమే ఆపారని ఆరోపిస్తున్నారు. మిగతా అందరి వ్యాపారాలకు అనుమతి ఇచ్చి తన ఒక్కరిపట్లే ఎందుకిలా అంటూ ప్రశ్నిస్తున్నారు.  సోషల్ మీడియా ద్వారానే పైకి వచ్చానని, ఇప్పుడు వారే ఆదుకోవాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలంటూ తన వద్దకు వచ్చే ఫుడ్ లవర్స్‌కు కుమారి ఆంటీ విజ్ఞప్తి చేస్తున్నారు. 

అయితే పోలీసులు మాత్రం.. చాలారోజుల నుంచి ఆమెను హెచ్చరిస్తూ వస్తున్నామని చెబుతున్నారు. ఆమె స్టాల్‌ మూలంగానే ఇక్కడ ట్రాఫిక్‌జామ్‌ అవుతోంది. ఈ విషయంపై ఆమెకు చెబుతూ వస్తున్నా.. ఆమె స్పందించలేదు. ఖాళీ చేసి ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తని మరోచోట బిజినెస్‌ చేస్కోమని ఆమెకు చెబుతున్నాం. పైగా అది ఆమె సొంత స్థలం కాదు. ఆమెనే కాదు.. ప్రస్తుతం నగరంలో ఉన్న చాలా రోడ్‌సైడ్‌ ఈటరీ స్టాల్స్‌కు అనుమతులు లేవు. ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా వ్యాపారం చేసుకుంటే మాకు ఫర్వాలేదు. కానీ, ఇక్కడ పరిస్థితి అలా లేదు. ఒకవేళ ఈ అంశంపై కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే గనుక మేం ఏం చేయలేం. ఒకవేళ కోర్టు గనుక తొలగించాల్సిందేనని చెబితే మాత్రం తీసేస్తాం అని రాయ్‌దుర్గం ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయానంద్‌ స్పష్టం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement