Hyderabad: అర్థరాత్రి తప్పతాగి ఎస్‌ఐని ఢీకొట్టారు.. తీవ్రగాయాలతో.. | Sakshi
Sakshi News home page

Hyderabad: అర్థరాత్రి తప్పతాగి ఎస్‌ఐని ఢీకొట్టారు.. తీవ్రగాయాలతో..

Published Sun, Dec 11 2022 10:56 AM

Hyderabad SI injured as Drunken Youth hit him with car - Sakshi

సాక్షి, హైదరాబాద్‌(హిమాయత్‌నగర్‌): మద్యం మత్తులో బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు డ్యూటీలో ఉన్న ఎస్‌ఐని ఢీకొట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..శుక్రవారం అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో హిమాయత్‌నగర్‌  మెక్‌డోనాల్డ్స్‌ సమీపంలో  ఎస్‌ఐ గౌనిగాని నరేష్‌ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై వన ఇద్దరు యువకులను ఆపేందుకు నరేష్‌ ప్రయత్నించాడు.

మద్యం మత్తులో ఉన్న సదరు యువకులు పోలీసులకు పట్టుబడతామనే భయంతో బైక్‌ వేగం పెంచారు. వారిని ఆపేందుకు అడ్డుగా వెళ్లిన నరేష్‌ను ఢీ కొట్టడంతో అతను అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐని హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అనంతరం నాంపల్లి కేర్‌ ఆసుపత్రికి తరలించారు. మోకాలి కాలి నుంచి పాదం వరకు ఉన్న ప్రధాన ఎముక విరగడంతో సర్జరీ చేసిన వైద్యులు స్టీల్‌ రాడ్డును అమర్చారు.  

నిందితుల అరెస్ట్‌ 
ఎస్‌ఐని ఢీకొట్టి బైక్‌పై పరారైన యువకులను పోలీసులు వెంబండించి పట్టుకున్నారు. బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ 190 కంటే ఎక్కువ మోతాదులో ఆల్కాహాల్‌ సేవించినట్లు నిర్థారణ అయ్యింది. నిందితులు రాంనగర్‌ రామాలయం ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్, న్యూ నల్లకుంటకు చెందిన యశ్వంత్‌గా గుర్తించిన పోలీసులు శనివారం ఉదయం వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  

చదవండి: (పెళ్లింట విషాదం.. కొద్దిక్షణాల్లో పెళ్లనగా పెళ్లికుమార్తె ఆత్మహత్య)

Advertisement
Advertisement