ఇంటర్‌ స్పాట్‌ షురూ | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ స్పాట్‌ షురూ

Published Thu, Mar 14 2024 5:45 AM

Inter exams ending today - Sakshi

నేటితో ముగియనున్న పరీక్షలు 

16 నుంచి పూర్తి స్థాయిలో మూల్యాంకనం... ఏప్రిల్‌ 

 మూడో వారంలోనే ఫలితాలు? 

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ మొదలైంది. ఈ నెల 16 నుంచి ఈ ప్రక్రియ మరింత ఊపందు కుంటుందని అధికారులు తెలిపారు. నెల రోజు ల పాటు ఇది కొనసాగుతుందని, పరీక్ష ముగిసిన వెంటనే విద్యార్థుల సమాధాన పత్రాలను మూల్యాంకన కేంద్రాల (స్పాట్‌ వాల్యూయేషన్‌)కు తరలిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు 10 లక్షల మంది వరకు పరీక్షలు రాస్తున్నారు.

దీన్ని దృష్టిలో ఉంచుకుని మూల్యాంకన కేంద్రాలనూ పెంచారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకటి, భద్రాద్రి కొత్తగూడెంలో మరో కేంద్రం అదనంగా ఏర్పాటు చేశారు. ఇంటర్‌ పరీక్షలు గు రువారం ముగియనున్న నేపథ్యంలో మూల్యాంకనం చేపట్టాల్సిన అధ్యాపకులు కొందరు ఇంకా ఇన్విజిలేషన్‌ విధుల్లోనే ఉన్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే వీరు కూడా ‘స్పాట్‌’లో భాగస్వాములవుతారని ఇంటర్‌ పరీక్షల విభాగం తెలిపింది.

ఈ ఏడాది నుంచి మూల్యాంకనాన్ని ఆన్‌లైన్‌లో పూర్తిస్థాయిలో చేపట్టాలని భావించారు. కానీ ప్రభు త్వం నుంచి ఆమోదం లభించకపోవడంతో ఎప్పటిలాగే సాధారణ పద్ధతిలో మూల్యాంకనం చేపడుతున్నారు.  
 
నిరంతర పర్యవేక్షణ 
ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల సమాధాన పత్రాలు 60 లక్షల వరకూ ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు మూల్యాంకన కేంద్రానికి చేరుకోగానే ఓఎంఆర్‌ షీట్‌లో ఉన్న విద్యార్థి వ్యక్తిగత సమాచారం తొలగిస్తారు. దీని స్థానంలో కోడ్‌ నంబర్‌ ఇస్తారు. కోడింగ్‌ మొత్తం ఇంటర్‌ బోర్డుకు ఆన్‌లైన్‌ ద్వారా అనుసంధానమై ఉంటుంది. తద్వారా సమాధాన పత్రం ఎవరిది అనే విషయం మూల్యాంకనం చేసే వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడతారు.

ఆయా కేంద్రాల్లో నిర్దేశిత సబ్జెక్టు అధ్యాపకులు సమాధాన పత్రాలను పరిశీలించి మార్కులేస్తారు. వీటిని మూడు దఫాలుగా అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత మార్కుల వివరాలు ఆన్‌లైన్‌ ద్వారా బోర్డుకు అందుతాయి. మార్కులు కంప్యూటరైజ్‌ చేసిన తర్వాత అధికారులు డీ కోడ్‌ చేస్తారు.

అన్ని సబ్జెక్టు మార్కులను క్రోడీకరిస్తారు. ఆ తర్వాత ఉన్నతాధికారులు సగటున కొన్ని పేపర్లను మరోసారి పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ అంతటిపై ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఆయా దశలను దాటిన తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు. 

వారం ముందుగానే ఫలితాలు? 
ఇంటర్‌ పరీక్ష ఫలితాలను వీలైనంత త్వరగా వెల్లడించాలని బోర్డు భావిస్తోంది. ప్రతి ఏటా ఏ ప్రిల్‌ నాలుగోవారంలో వెల్లడించడం ఆనవాయితీ. అయితే ఈసారి ఇంతకన్నా ముందే రిజల్ట్స్‌ ఇవ్వాలని అధికారులు అనుకుంటున్నారు.

మూల్యాంకన ప్ర క్రియతో పాటు డీకోడింగ్‌ విధానాన్ని వేగంగా పూర్తి చేసి మూడో వారంలోనే ఫలితాలు ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. వీలైనంత త్వరగా ఫలితాలు ప్రకటించేందుకు కృషి చేస్తున్నామని ఇంటర్‌ పరీక్షల విభాగం అధికారిణి జయప్రదాభాయ్‌ తెలిపారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement