Sakshi News home page

దేశమంతటా మన పథకాలే

Published Tue, Jan 25 2022 3:50 AM

KTR Says Telangana Govt permanently Solve Drinking Water Problem Hyderabad - Sakshi

మణికొండ: రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, ఇంటింటికి తాగునీరు లాంటి ఎన్నో పథకాలు దేశానికే మార్గదర్శకంగా మారాయని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రైతుబంధు పథకాన్ని పీఎం కిసాన్‌ సమ్మాన్‌ స్కీమ్‌గా, మిషన్‌ భగీరథను హర్‌ ఘర్‌కు జల్‌ పథకాలుగా కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు, పరిశ్రమ లకు, గృహాలకు 24 గంటలు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. హైదరాబాద్‌ శివారు మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో రూ.1,200 కోట్లతో అమలు చేస్తున్న ఇంటింటికి నీటి సరఫరా పథకం రెండో విడతకు సంబంధించి రూ.587 కోట్లతో రాజేంద్రనగర్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో చేపట్టనున్న పనులకు కేటీఆర్‌ సోమవారం శంకుస్థాపన చేశారు.

మణికొండ మున్సిపాలిటీలోని అలకాపూర్‌ టౌన్‌షిప్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు పి.మహేందర్‌ రెడ్డి, డాక్టర్‌ వాణిదేవి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి,  జలమండలి ఎండీ దానకిశోర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా ప్రజలకు తాగునీరు, సాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో లేకపోవటం విచారించదగిన విష యమని అన్నారు.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ మార్గదర్శకంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో తాగు, సాగునీరు, 24 గంటల విద్యుత్, రైతుబంధు వంటి పథకాలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలు స్తున్నామన్నారు. ఒకప్పుడు పశ్చిమబెంగాల్‌లో నేడు ఏది జరిగితే అది రేపు దేశవ్యాప్తంగా జరుగుతుందనే నానుడి ఉండేదని, దాన్ని మార్చి ఇపుడు నేడు తెలంగాణలో ఏది జరిగితే అది రేపు దేశవ్యాప్తంగా జరుగుతుందనే ఒరవడిని సృష్టించామని పేర్కొన్నారు. 

హైదరాబాద్‌కు ఎన్నో అనుకూలతలు..
ఢిల్లీ, చెన్నై, ముంబై లాంటి మెట్రోనగరాలకు ఎన్నో సమస్యలు ఉన్నాయని, అదే హైదరాబాద్‌కు అటు వాతావరణ అనుకూలతతో పాటు నీటి సౌకర్యం మెండుగా ఉందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. దీంతో హైదరాబాద్‌ దేశంలోనే శరవేగంగా అభి వృద్ధి చెందుతోందన్నారు. హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయడానికి గతంలో అనేక పనులు చేపట్టామని చెప్పారు. అలాగే గ్రేటర్‌ హైదరా బాద్‌లో విలీనం అయిన శివారు మున్సిపాలిటీల్లో రూ.775 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ శివారులో ఉన్న కొత్త మున్సిపాలిటీలను గ్రేటర్‌లో భాగంగానే పరిగణించి రూ.1200 కోట్లతో పనులు చేపడు తున్నామన్నారు.

2051 సంవత్సరం నాటికి పెరిగే జనాభాకు అనుగుణంగా తాగునీటి సౌకర్యాలను కల్పించేందుకు కార్యాచరణ చేపట్టామని తెలిపారు. ఇందులో భాగంగా సుంకేసుల నుంచి రూ.1,400 కోట్లతో మరో అదనపు నీటిలైను, కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి గండిపేట వరకు మరో నీటి సరఫరా లైన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరానికి 600 ఎంజీడీల నీరు వస్తుండగా దాన్ని వెయ్యి ఎంజీడీలకు పెంచే పనులు కొనసాగుతున్నా యన్నారు.

Advertisement
Advertisement