కరోనా భయం: భార్య మృతదేహాన్ని మోసుకొని 3 కిలోమీటర్లు.. | Sakshi
Sakshi News home page

కరోనా భయం: భార్య మృతదేహాన్ని మోసుకొని 3 కిలోమీటర్లు..

Published Mon, Apr 26 2021 1:02 PM

Man Carried His Wife Deceased Body Three Kilometers On Shoulders In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అదే స్థాయిలో మనుషుల్లో మానవత్వం రోజురోజుకు దిగజారుతోంది. సాటి మనిషికి సాయం చేయాలనే భావన కూడా లోపిస్తోంది. తాజాగా కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో నాగలక్ష్మి అనే ఓ యాచకురాలు మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించేందుకు సహాయం చేయలని మృతురాలి భర్త స్వామి స్థానికులను ప్రాధేయపడ్డాడు. అయితే ఆమె కరోనాతో మృతి చెందిందనే అనుమానంతో స్థానికులు ఒక్కరు కూడా మృతదేహం వెళ్లలేదు.

దీంతో ఆటోలో తన భార్య మృతదేహన్ని తరలించాలని ఆటో డ్రైవర్లను కూడా స్వామి ప్రాధేయపడగా వారు కూడా నిరాకరించారు. దిక్కుతోచని స్వామి భార్య మృతదేహాన్ని స్వయంగా తన భుజాన వేసుకుని మూడున్నర కిలోమీటర్ల దూరం ఉన్న శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించాడు. మార్గమధ్యలో మృతదేహంతో తనకు సాయం అందించాలని రోడ్డు మీద జనాలను అర్థించాడు. అయినా ఎవరూ కనికరం చూపించలేదు. ఈ ఘటన తెలుసుకున్న రైల్వే పోలీసులు, కొంత మంది స్థానికులు కలిసి 2500 రూపాయలను అంత్యక్రియల నిమిత్తం నాగలక్ష్మి భర్త స్వామికి అందజేశారు.


చదవండి: మమ అన్నట్టు మాస్కు ధరిస్తే కోవిడ్‌కు స్వాగతం పలికినట్టే!

Advertisement
Advertisement