Sakshi News home page

సామాజిక సేవలోనూ ఆదర్శంగా రెడ్లు

Published Sun, Dec 25 2022 2:59 AM

MP Pocha Brahmananda Reddy Participated Reddy Business Conclave 2022 - Sakshi

మాదాపూర్‌: వ్యాపారంలో వచ్చిన లాభాలను సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తూ ఇతర కులాల వారికి కూడా రెడ్లు ఆదర్శంగా నిలుస్తున్నారని నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో రెడ్డి బిజినెస్‌ కాన్‌క్లేవ్‌–2022 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులతోపాటు ఆర్థికరంగ నిపుణులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఎంటర్‌ప్రెన్యూర్లు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న సాక్షి మీడియా గ్రూప్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ వైఈపీ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఇటువంటి వేదిక ఏర్పాటు చేసి అందరినీ ఒక్కతాటిపైకి తేవడం మంచి విషయమన్నారు. దీనివల్ల కొత్తగా వ్యాపార రంగంలోకి వస్తున్న వారికి చాలా విషయాలు తెలుస్తాయని చెప్పారు. రెడ్డి సామాజిక వర్గంలోనూ ఎందరో పేదలు ఉన్నారని... వారికి ఇలాంటి సదస్సులు ఎంతో ఉపయోగంగా ఉంటాయన్నారు.

ఈ సందర్భంగా పలువురు ఆర్థిక నిపుణులు, పలు కంపెనీల సీఈవోలు వ్యాపార మెళకువలను పంచుకున్నారు. వచ్చే ఐదేళ్లలో 5 వేల మంది ఔత్సాహిక వ్యాపారస్తులకు తాము ఎన్నుకున్న రంగాల్లో రాణించేందుకు ఈ కాన్‌క్లేవ్‌ తోడ్పాటునందిస్తుందని నిర్వాహకుడు భరత్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌కే గ్రూప్‌ సీఎండీ, క్రెడాయ్‌ జాతీయ ఉపాధ్యక్షుడు గుమ్మి రామ్‌రెడ్డి, సౌభాగ్య గ్రూప్‌ సీఎండీ సీహెచ్‌ చంద్రారెడ్డి, టీఎస్‌ ఏవియేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ వీఎన్‌ భరత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, జయంతిరెడ్డి, డాక్టర్‌ సుధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement