16 నుంచి భద్రాద్రిలో నూతన ఆర్జిత సేవలు | Sakshi
Sakshi News home page

16 నుంచి భద్రాద్రిలో నూతన ఆర్జిత సేవలు

Published Mon, Apr 10 2023 4:04 AM

Newly acquired services in Bhadradri from 16 - Sakshi

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 16 నుంచి నూతన ఆర్జిత సేవలు ప్రారంభించనున్నట్లు ఈఓ రమాదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సేవలకు సంబంధించిన వివరాలను గతంలో వెల్లడించిన ఆలయ అధికారులు.. భక్తులు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు అందజేయాలని కోరారు. ఈ ఏడాది జనవరి నుంచే నూతన సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో జాప్యం 
జరిగింది.  

సేవల వివరాలు ఇవీ.. 
వేదాశీర్వచనం: స్వామివారి దర్శనానంతరం బేడా మండపంలో (ఒక్కొక్కరికి లేదా దంపతులు) రూ.500 టికెట్‌తో ఉదయం 9.30, 10, 10.30, 11 గంటల స్లాట్స్‌లలో ఆశీర్వాదాలు అందజేస్తారు. ఇందులో పాల్గొన్న భక్తులకు కండువా, జాకెట్‌పీసు, 100 గ్రామల లడ్డూ అందజేస్తారు.  

స్వామివారికి తులసీమాల అలంకరణ (ప్రతి శనివారం) 
రూ.1,000 టికెట్‌తో దంపతులు లేదా ఒకరికి ఉదయం 7 గంటలకు ఉభయదాత శిరస్సుపై తులసీమాల ఉంచి ఆలయ ప్రదక్షిణ చేయిస్తారు. ఆ తర్వాత అంతరాలయంలో భక్తుల సమక్షంలో ధ్రువమూర్తులకు అలంకరణ చేస్తారు. ఇందులో పాల్గొన్న వారికి కండువా, జాకెట్‌ పీసు, 100 గ్రాముల లడ్డూలు రెండు, అంతరాలయ అర్చనతో రామకోటి పుస్తకాన్ని బహూకరిస్తారు.  

స్వామివారి నిత్య సర్వ కైంకర్య సేవ  
రూ.5 వేల టికెట్‌తో ప్రతి రోజూ జరిగే అన్ని సేవలలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దంపతులు పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఆ రోజు 10 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇందులో పాల్గొనే భక్తులకు సుప్రభాతం, అభిõషేకం, అంతరాలయ అర్చన, శ్రీలక్ష్మీ అమ్మవారి అర్చన, శ్రీ ఆంజనేయ స్వామి వారి అర్చన, నిత్యకల్యాణం, వేదాశీర్వచనం, సచిత్ర రామాయణ పుస్తకం, ముత్యాల తలంబ్రాల ప్యాకెట్, అదనంగా ఐదుగురికి అన్నప్రసాదం, దర్బారు సేవ, పవళింపు(ఏకాంత) సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది. 

శ్రీరామనవమి ముత్యాల తలంబ్రాల సమర్పణ 
రూ.10 వేల టికెట్‌తో శ్రీరామనవమి కల్యాణ టికెట్‌ సెక్టార్‌ – 2లో రెండు సంవత్సరాలకు టికెట్లు (ఉభయం), కల్యాణ వ్రస్తాలు, ప్రసాదాలు, 108 ముత్యాలతో కూడిన తలంబ్రాలు అందజేస్తారు. 

నిత్య పూల అలంకరణ సేవ 
రూ. 5 వేల టికెట్‌తో సోమవారం నుంచి శనివారం వరకు జరిగే పూజల్లో స్వామి వారికి, ఉపాలయాల్లో అవసరమైన పూల దండల సమర్పణ. ఇందులో పాల్గొనే వారికి కండువా, జాకెట్‌ పీసు, రెండు చిన్న లడ్డూలు, నలుగురికి అన్నప్రసాదం అందజేస్తారు.  

తులాభారం  
రూ.100 టికెట్‌ ధరతో ప్రతి రోజూ తులాభారం (భక్తులు మొక్కుకున్న చిల్లర నాణేలు, లేదా బియ్యం.. తదితర వస్తువులు) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు అందించవచ్చు.  

Advertisement
Advertisement