పెళ్లి బరాత్‌.. అంతలో సడన్‌గా పోలీసుల ఎంట్రీ ! | Sakshi
Sakshi News home page

పెళ్లి బరాత్‌.. అంతలో సడన్‌గా పోలీసుల ఎంట్రీ !

Published Sat, Aug 28 2021 8:00 AM

Police Complaint Filed On Bride Groom For Baraat Without Permission Hyderabad - Sakshi

సాక్షి, సనత్‌నగర్‌(హైదరాబాద్‌): సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మోతీనగర్‌లో శుక్రవారం తెల్లవారుఝామున నిర్వహించిన పెళ్లి బరాత్‌ (ఊరేగింపు) కలకలం సృష్టించింది. ఎటువంటి అనుమతి లేకుండా ఊరేగింపు నిర్వహించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మోతీనగర్‌కు చెందిన ఉదయ్‌కృష్ణ వివాహం గురువారం నిర్మల్‌లో జరిగింది. పెళ్లికూతురితో కలిసి మోతీనగర్‌కు చేరుకున్న ఉదయ్‌ కృష్ణకు బంధుమిత్రులు బరాత్‌ నిర్వహించారు.

తెల్లవారుఝామున పెళ్లి బరాత్‌తో స్థానికంగా శబ్ధ కాలుష్యంతో ఇబ్బంది పడి స్నేహపురికాలనీకి చెందిన కొందరు డయల్‌ 100కు సమాచారం ఇచ్చారు. దీంతో సనత్‌నగర్‌ గస్తీ సిబ్బంది వచ్చి పెళ్లి బరాత్‌ను అడ్డుకున్నారు. అయితే ఊరేగింపులో కొందరు మద్యం మత్తులో పోలీసులను దుర్భాషలాడుతూ నెట్టివేయడంతో పోలీసులు పెళ్లి కుమారుడు ఉదయ్‌కృష్ణ, అతని తండ్రి జానకిరామ్‌ మరి కొందరిపై కేసు నమోదు చేశారు. ఉదయాన్నే వీరిని తీసుకువచ్చేందుకు సనత్‌నగర్‌ ఎస్‌ఐ నర్సింహగౌడ్‌ తన సిబ్బందితో కలిసి వెళ్లారు.

కేసు నమోదు కావడంతో పెళ్లి కొడుకు తండ్రి, మరి కొందరిని ఠాణాకు రమ్మని చెప్పారు. అయితే పెళ్లింట్లోకి పోలీసులు ప్రవేశించడం ఏమిటంటూ పోలీసులు వచ్చిన దృశ్యాలను వీడియో తీసి వైరల్‌ చేశారు. ఈ విషయమైన ఇన్‌స్పెక్టర్‌ ముత్తు యాదవ్‌ మాట్లాడుతూ స్థానికుల ఫిర్యాదు మేరకే అనుమతి లేని పెళ్లి బరాత్‌ను అడ్డుకున్నామన్నారు. తమ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించడం, ఊరేగింపునకు అనుమతి లేకపోవడంతో కేసు నమోదు చేశామని చెప్పారు.   

చదవండి: అలిగి మండపం ఎక్కనన్న వధువు.. కారణం తెలిసి నవ్వుకున్న నెటిజన్స్‌

Advertisement
Advertisement