ప్రశాంతంగా సింగరేణి ఉద్యోగ పరీక్ష | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా సింగరేణి ఉద్యోగ పరీక్ష.. 79 శాతం మంది అభ్యర్థులు హాజరు

Published Mon, Sep 5 2022 9:04 AM

Singareni Jobs Exam Held Peacefully - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణిలోని 177 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం తెలంగాణలోనివివిధజిల్లాల్లో ఆదివారం నిర్వహించిన రాతపరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు డైరెక్టర్‌(పర్సనల్‌) ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసినవారిలో 79 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 98,882 మంది అభ్యర్థుల హాల్‌టికెట్లను సింగరేణి వెబ్‌సైట్‌లో ఉంచగా 90,928 మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వారిలో 77,907 మంది పరీక్షకు హాజరయ్యారు.

మొత్తం 187 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా పరిశీలిస్తే.. మంచిర్యాల జిల్లాలో 7,875 (88.62 శాతం), భద్రాద్రి కొత్తగూడెం 12,079(87.31 శాతం), వరంగల్‌ 9,221(84.6 శాతం), కరీంనగర్‌ 16,286(82.09 శాతం), ఖమ్మం 9,915 (81.35 శాతం), హైదరాబాద్‌ 12,672(72.63 శాతం) మంది హాజరుకాగా, తక్కువగా ఆదిలాబాద్‌ జిల్లాలో 2,718(64.42 శాతం) మంది హాజరయ్యారు.

డైరెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ కరీంనగర్‌ జిల్లాలోని పలు పరీక్షాకేంద్రాల్లోని ఏర్పాట్లను పర్యవేక్షించారు. హైదరాబాద్‌లో జనరల్‌ మేనేజర్‌(కో ఆర్డినేషన్‌) కె.సూర్యనారాయణ పరీక్షాకేంద్రాలకు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, కొన్నికేంద్రాల్లో ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతించలేదు. 

7న అభ్యంతరాలు సమర్పించాలి
ఆదివారం జరిగిన సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ రాత పరీక్ష ఏ, బీ, సీ, డీ ప్రశ్నపత్రాలకు సంబంధించిన ‘కీ’ని సోమవారం(సెపె్టంబర్‌ 5వ తేదీ) ఉదయం 11 గంటలకు సింగరేణి వెబ్‌సైట్‌ https://scclmines.com/ లో ఉంచనున్నట్లు డైరెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే బుధవారం(సెపె్టంబర్‌ 7న) ఉదయం 11 గంటల లోపు సింగరేణి వెబ్‌ సైట్‌ ద్వారానే అభ్యంతరాలు సమర్పించాలని కోరారు.
చదవండి: ఆ ఆశతో గణేష్ లడ్డూను దొంగిలించిన పిల్లలు

Advertisement
Advertisement