సాక్షి, హైదరాబాద్: పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యుత్ సంస్థలో పనులకు ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచాలని తెలంగాణా విద్యుత్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఉత్తర డిస్కంతో సమానంగా దక్షిణ డిస్కంలో కాంట్రాక్ట్ పనుల ధరలను సవరించాలని కోరింది. అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం ఇక్కడ మంత్రి జగదీష్ రెడ్డి, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావుతో సమావేశమయ్యారు.
పనుల అంచనా వ్యయాల్లో పీఎఫ్, ఈఎస్ఐ, సెస్, కాంట్రాక్టర్ల అలవెన్సులను కలపాలని కోరారు. అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్, ప్రధాన కార్యదర్శి ఎస్కే మాజిద్, సంయుక్త కార్యదర్శి సదానందం, ఆర్గనైజింగ్ సెక్రటరీ పర్వతాలు పాల్గొన్నారు.