50లోపు మినహాయింపు.. ఆపై పెంపు | Sakshi
Sakshi News home page

50లోపు మినహాయింపు.. ఆపై పెంపు

Published Sun, Dec 19 2021 3:09 AM

TS State Electricity Distribution Corporation Preparing To Raise Electricity Charges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఐదేళ్ల విరామం తర్వాత విద్యుత్‌ చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు పేదలపై మాత్రం కరుణ చూపనున్నాయి. నెలకు 50 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే పేదల గృహాలకు చార్జీల పెంపు నుంచి మినహాయింపు ఇవ్వాలని డిస్కంలు నిర్ణయించినట్లు తెలిసింది. చివరిసారిగా ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో 0–50 యూనిట్లలోపు గృహ వినియోగ విద్యుత్‌ చార్జీలు పెంచారు. 

40 లక్షల పేదల గృహాలకు ఊరట.. 
గృహ కేటగిరీలో 0–50 యూనిట్లలోపు వినియోగానికి ఒక్కో యూనిట్‌కు రూ. 1.45 పైసలు, 51–100 యూనిట్లలోపు వినియోగానికి రూ. 2.60 పైసలు, 101–200 యూనిట్ల వరకు వినియోగానికి రూ. 4.30 పైసల చొప్పున ప్రస్తుతం డిస్కంలు విద్యుత్‌ చార్జీలు వసూలు చేస్తున్నాయి.

తాజాగా 0–50 యూనిట్లలోపు మినహా మిగిలిన అన్ని గ్రూపుల వినియోగదారుల విద్యుత్‌ చార్జీలు పెరగనున్నట్లు తెలిసింది. డిస్కంల నిర్ణయంతో 0–50 యూనిట్లలోపు వినియోగించే దాదాపు 40 లక్షల వరకు పేదల గృహాలకు ఊరట లభించనుందని అధికార వర్గాలు తెలిపాయి. 

80 లక్షల గృహాలపై బాదుడు... 
రాష్ట్రంలో అన్ని కేటగిరీల విద్యుత్‌ కనెక్షన్లు కలిపి మొత్తం 1.64 కోట్లు ఉన్నాయి. అందులో 1.2 కోట్ల గృహ, 25 లక్షలు వ్యవసాయ, 15.6 లక్షల వాణి జ్య, 1.01 లక్షల పారిశ్రామిక, 2.8 లక్షల ఇతర కేటగిరీల కనెక్షన్లున్నాయి.

నెలకు 51–100, 101–200 ఆపై యూనిట్లు వినియోగమయ్యే దాదాపు 80 లక్షల గృహాలకు సంబంధించిన విద్యుత్‌ చార్జీలను పెంచాలని డిస్కంలు నిర్ణయించినట్లు సమాచా రం. ఇతర రాష్ట్రాల్లో వినియోగదారుల నుంచి వ సూలు చేస్తున్న చార్జీలపై విద్యుత్‌ సంస్థలు అధ్యయనం చేశాయి.

పలు రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రం లో గృహ, పరిశ్రమల కేటగిరీల చార్జీలు తక్కువగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చాయి. ఇతర రాష్ట్రాల్లోని విద్యుత్‌ చార్జీలను ప్రామాణికంగా తీసుకొని వాటికి మించకుండా రాష్ట్రంలోనూ చార్జీల పెంపు ను ప్రతిపాదించేందుకు సిద్ధమయ్యాయి. 

మధ్యతరగతిపై భారం.. 
వివిధ కేటగిరీలు, వినియోగం ఆధారిత గ్రూపు ల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాలను సైతం డి స్కంలు కొంత వరకు తగ్గించి హేతుబద్ధీకరణ చేపట్టినట్లు తెలిసింది. గృహ కేటగిరీలో 101– 200 యూనిట్లు, ఆపై వినియోగ గ్రూపుల మధ్య ఉన్న తీవ్ర వ్యత్యాసాలను కాస్త తగ్గించనున్నారు. దీంతో మధ్యతరగతిపై ఈసారి విద్యుత్‌ చా ర్జీల భారం భారీగానే పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా వారి విద్యుత్‌ బిల్లులు దాదాపు రెట్టింపయ్యే అవకాశాలున్నాయి.

సగటున యూనిట్‌పై రూపాయి వరకు టారిఫ్‌ పెంచి ఈ ఆదాయ లోటును పూడ్చుకోవాలని డిస్కంలు భావిస్తున్నట్లు తెలిసింది. నిర్దేశిత గడువులోగా విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కంలు సమర్పించని నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సోమవారం ప్రత్యేక విచారణ నిర్వహించతలపెట్టింది. ఆలోగా విద్యుత్‌ టారిఫ్‌ ప్రతిపాదనలను డిస్కంలు సమర్పించవచ్చని తెలిసింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement