గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు.. అప్పీల్‌కు వెళ్లిన టీఎస్‌పీఎస్సీ | TSPSC Appeal At Divisional Bench On High Court Cancels Group 1 Prelims Exam 2023 - Sakshi
Sakshi News home page

గ్రూప్‌ - 1 ప్రిలిమ్స్‌ రద్దు.. అప్పీల్‌కు వెళ్లిన టీఎస్‌పీఎస్సీ

Published Mon, Sep 25 2023 12:12 PM

TSPSC Appeal At Divisional Bench ON HC Cancels Group 1 Prelims - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు  ఇచ్చిన తీర్పుపై టీఎస్‌పీఎస్సీ అప్పీలుకు వెళ్లింది. ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ ఈనెల 23న సింగిల్‌ బెంచ్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను టీఎస్‌పీఎస్సీ ఆశ్రయించింది. అత్యవసర విచారణకు లంచ్‌మోషన్‌ అనుమతి కోరింది. అయితే లంచ్‌మోషన్‌ పిటిషన్‌ విచారణకు నిరాకరించిన హైకోర్టు.. రేపు (మంగళవారం) విచారణ జరిపేందుకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అంగీకరించింది. 

కాగా జూన్ 11న నిర్వహించిన గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ ఈ నెల 23న హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి 11 ఏళ్ల తర్వాత గతేడాది అక్టోబరు 16న తొలిసారి ప్రిలిమ్స్‌ నిర్వహించారు. తరువాత ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేసింది.

తిరిగి జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించగా.. ఈ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్లు ఈనెల 23న హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చింది. దీంతో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రెండుసార్లు రద్దవడంతో ఇటు అభ్యర్థులతోపాటు కమిషన్‌లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది.

గ్రూప్1 పరీక్ష రద్దు కావడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. పదే పదే పరీక్షలు రద్దు చేస్తే ఎలా చదవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ నిర్లక్ష్యం వల్ల తమ జీవితాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ స్పందించక పోవడంపై మండిపడుతూ.. వెంటనే టీఎస్‌పీఎస్సీ ఛైర్మెన్ జనార్దన్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు.
చదవండి: కాంగ్రెస్‌లో చేరాలని డిసైడ్‌ అయ్యా: మైనంపల్లి

Advertisement
Advertisement