TSRTC: న్యూ ఇయర్‌లో షాకిచ్చిన ఆర్టీసీ.. సిటీలో ప్రయాణికులకు అలర్ట్‌ | Sakshi
Sakshi News home page

TSRTC: న్యూ ఇయర్‌లో షాకిచ్చిన ఆర్టీసీ.. సిటీలో ప్రయాణికులకు అలర్ట్‌

Published Mon, Jan 1 2024 10:59 AM

TSRTC Canceled Family-24 And T-6 Tickets In City Buses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త ఏడాదిలో సిటీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గట్టి షాకిచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సిటీ బస్సుల్లో ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరిస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఆదివారం ప్రకటించింది. ఈ నిర్ణయం జనవరి 1, 2024 నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో పూర్తి టికెట్‌ ధరతో ప్రయాణించాల్సి ఉంటుంది. 

అయితే, ఆర్టీసీ బస్సులు ప్రయాణికుల రద్దీ కోసం టీఎస్‌ఆర్టీసీ ఫ్యామిలీ-24, టీ-6 రాయితీ టికెట్లను ప్రవేశపెట్టింది. దీనికి మంచి స్పందన కూడా లభించింది. కాగా, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఇప్పుడు ప్రయాణికులే బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రయాణికుల నుంచి ఎదురుచూపులతో ఆర్టీసీకి డిమాండ్‌ పెరిగింది. దీంతో ఫ్యామిలీ-24, టీ-6 రాయితీ టికెట్లను ఉపసంహరించుకుంది.

ఈ సందర్బంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘ప్రయాణికులకు ముఖ్య గమనిక! మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 

ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతో  ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదు’ అని తెలిపారు. 

Advertisement
Advertisement